రాష్ట్రంలో రాజుకున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు సామాజిక కోణంలోనూ సెగలు రేపుతున్నాయి. ముఖ్యంగా కాపు ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆ వర్గంలోని ఓ వర్గం చంద్రబాబుకి వ్యతిరేకంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఆ వర్గాన్ని బుజ్జగించాల్సిన అవసరం బాబుపై ఎంతైనా ఉందనేది విశ్లేషకుల మాట. ఇక, ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల తరఫున టీడీపీ ఓ అభ్యర్థిని నిలపాల్సి ఉంది. ఇప్పుడు దీనిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని బాబు వ్యూహం సిద్ధం చేస్తున్నారు. అయితే, ఇదేమంత వీజీ కాదని టాక్.
ఈ పోస్ట్ కోసం ఇప్పటికే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరావు సహా హేమా హేమీలు పోటీలో ఉన్నారు. ఇటు కాపు, అటు కమ్మ సామాజిక వర్గాల నుంచి బాబుపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే, బొడ్డు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం ఆయనకు ప్లస్ అయినా.. ప్రస్తుతం రాష్ట్రంలో మారిన ట్రెండ్ ను బట్టి.. బాబు కాపులకు మద్దతిస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బొడ్డుకు మరోసారి ఛాన్స్ ఇవ్వాలని కొందరు, అలాకాదు 2009,2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ‘జగ్గంపేట’ నుండి ఓడిపోయిన ‘జ్యోతుల చంటిబాబుకు ఛాన్స్ ఇవ్వాలని మరికొందరు బాబు దగ్గర ఒత్తిడి తెస్తున్నారు.
చంటిబాబుకు ఎలాగూ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదుకాబట్టి.. ఆయనను ఎమ్మెల్సీగా పంపించే అవకాశం ఉందని అంటున్నారు. మరోపక్క, ఈయన ఎలాగూ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అటు కాపులను మచ్చిక చేసుకునేందుకు కూడా బాబుకి బాగుంటుందని కొందరు పేర్కొంటున్నారు. ఇక, ఈ సీటుకి పోటీలో మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కుమారుడు ‘మెట్ల రమణబాబు, కాకినాడ ఎంపీ తోట నర్సింహం స్వయానా బావమరిది కూడా లైన్లో ఉన్నారు.
ఇక, మరో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు కూడా తన పేరును పరిశీలించాలని బాబుపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇదిలావుంటే, మంత్రి యనమల చక్రం తిప్పుతున్న జిల్లా కాబట్టి.. ఆయన సిఫార్సుల లిస్ట్ కూడా భారీగానే ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.