టీడీపీ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సదరు వ్యక్తి ఆర్థికంగా ఎంతో వెన్నుదన్నుగా నిలిచారు. ఆయనపై లెక్కలేనన్ని ఆర్థికపరమైన కేసులు కూడా ఉన్నాయి. అప్పటికే పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి. అయినా చంద్రబాబు మాత్రం సదరు వ్యక్తిని రాజ్యసభకు పంపారు. ఏపీలో పార్టీ గెలవడంతో పాటు కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీ గెలవడంతో ఆయన్ను కేంద్రమంత్రిని చేశారు…ఇక గతేడాది మరోసారి ఆయన రాజ్యసభ రెన్యువల్ చేశారు.
2019 పార్టీ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో సైతం కొన్ని ఏరియాల్లో ఆయనదే ప్రధాన పాత్ర. ఆయన చెప్పినట్టే చంద్రబాబు నడుచుకున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అదే టీడీపీలో సడెన్గా సైలెంట్ అయిపోయారు. తెరవెనక్కు వెళ్లిపోయారు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరో ఇప్పటికే మీరు ఓ క్లారిటీ వచ్చి ఉంటుంది. ఆయనే కేంద్ర మంత్రి సుజనాచౌదరి.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్లపాటు టీడీపీ కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అండ్ ఫైనాన్షియర్ సుజానా చౌదరినే. పార్టీకి సంబంధించి చేసిన పైసా ఖర్చంతా ఆయన చేతుల మీదగానే ఇచ్చేవారు. తర్వాత రాజ్యసభ – కేంద్రమంత్రి – మళ్లీ రాజ్యసభ రెన్యువల్ వరకు కథంతా బాగానే నడచింది. అక్కడ నుంచి సుజనాకు పార్టీలో ప్రయారిటీ తగ్గడం స్టార్ట్ అయ్యింది.
లోకేశ్కు సుజనాకు పొరాపొచ్చలు రావడం వల్లే పార్టీలో సుజనా ప్రాధాన్యం తగ్గుతోందన్న చర్చలు అప్పట్లో వినిపించాయి. ఇక ఒకప్పుడు సుజనాతో అన్ని విషయాలు చర్చించే లోకేశ్ ఇప్పుడు సుజనాను గుర్తు పెట్టుకున్నట్టు కూడా కనిపించడం లేదట. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావుతో లోకేశ్ మూవ్ అవుతున్నారు.
ఇక చంద్రబాబు సైతం సుజనాకు ప్రాధాన్యం తగ్గించేశారట. బలమైన ఓటు బ్యాంకు ఉన్న కళా వెంకటరావును ముందు పెట్టి నడిపించడమే మేలన్న భావనకు చంద్రబాబు వచ్చారని అందుకే సుజానాతో పాటు చాలా మంది నాయకులు తెరవెనక్కు వెళ్లిపోయారన్న గుసగుసలు టీడీపీలో అంతర్గతంగా వినిపిస్తున్నాయి.