తెలంగాణలో నిత్యం విమర్శలు ఎదుర్కొంటున్న శాఖ ఏదైనా ఉందంటే అది.. వైద్య, ఆరోగ్య శాఖ! ప్రభుత్వాసుపత్రు ల్లోనే వైద్యం చేయించుకోవాలని ఒకపక్క ప్రభుత్వం ప్రచారం చేస్తుంటే.. మరోపక్క ఆ ఆసుపత్రుల్లో మరణాలు ప్రభుత్వానికీ, ఆ శాఖ మంత్రికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారికి కష్టాలు తప్పడం లేదు! ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో బాలింతల మరణాలు, నీలోఫర్ ఆసుపత్రుల్లో చిన్నారి ప్రవళిక మృతితో వైద్య శాఖ తీవ్రంగా విమర్శల పాలవుతోంది. దీంతో తనకు ఆ శాఖ వద్దని, తనను వేరే శాఖకు మార్చాలని ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి.. సీఎం కేసీఆర్కు మొరపెట్టుకుంటున్నారట.
డాక్టర్ల వైఫల్యం మంత్రి లక్ష్మారెడ్డి మెడకు చుట్టుకుంటోంది. దీంతో ఆయన పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారు. ఒకవైపు నీలోఫర్ లో బాలింతల మృతి, మరోవైపు గాంధీలో చిన్నారి ప్రవళిక మృతితో ఆయన తీవ్రంగా మనస్థాపం చెందారని తెలుస్తోంది. గతంలో నీలోఫర్ లో అధికారికంగా ఐదుగురు బాలింతలు మృతి చెందారు. అనధికారికంగా ఇంకా ఎక్కువమంది చనిపోయి ఉంటారనేది సమాచారం. ఈ ఘటనలో డాక్టర్ల వైఫల్యమే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు గాంధీ ఆస్పత్రిలో చిన్నారి ప్రవళిక మృతి విషయంలోనూ ఇదే పునరావృతం అయింది.
పురుగులు ఉన్న సెలైన్ ను ఎక్కించడం వల్లే చిన్నారి ఆరోగ్యం దెబ్బతింది. రెండునెలల పాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి… ఆ పోరాటంలో ఓడిపోయింది. ఈ రెండు సంఘటనలతో లక్ష్మారెడ్డి తీవ్రంగా ఆవేదన చెందినట్టు సమాచారం. ప్రభుత్వం ఎంత భరోసా ఇస్తున్నా… ప్రభుత్వాసుపత్రుల తీరు మారకపోవడంపై లక్ష్మారెడ్డి ఆగ్రహంగా ఉన్నారట. ఇక ఈ శాఖలో పనిచేయడం తన వల్ల కాదని సీఎం కేసీఆర్ తోనూ చెప్పేశారట. శాఖ మార్చాలని సీఎం కేసీఆర్కు విన్నవించుకున్నారట. అయితే మంత్రి వాదనతో కేసీఆర్ కూడా ఏకీభవించారని తెలుస్తోంది,