తెలుగు తమ్ముళ్లలో టెన్షన్.. ఎమ్మెల్సీ టికెట్ల పంచాయతీ!

ఏపీ అధికార పార్టీ టీడీపీలో నేత‌ల మ‌ధ్య న‌రాలు తెగే టెన్ష‌న్ కొన‌సాగుతోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న వైఖ‌రిపై నేత‌లు మ‌ల్ల‌గుల్లాలు పడుతున్నారు. దీనంత‌టికీ కార‌ణంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేడి రాజుకోవ‌డ‌మే. అన్ని స్థానాల్లోనూ క‌లిపి దాదాపు 15 మందికి టెకెట్లు కేటాయించాల‌ని బాబు డిసైడ్ అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే ఆదివారం విజ‌య‌వాడ కేంద్రంగా ఎమ్మెల్సీ టికెట్లపై పంచాయ‌తీ ప్రారంభించారు. పార్టీ పొలిట్ బ్యూరోతో భేటీ అయిన బాబు.. ఆయా సీట్ల కేటాయింపుపై వారితో చ‌ర్చించారు.

అయితే, ఆశావ‌హులు ఎక్కువ‌గా ఉండ‌డం, సామాజిక వ‌ర్గాల కూడిక‌లు, తీసివేత‌లు, బంధు వ‌ర్గం నుంచి ఒత్తిడులు, మొహ‌మాటాలు, రాబోయే 2019 ఎన్నిక‌లు, కొన్ని సామాజిక వ‌ర్గాల నుంచి పెరుగుతున్న ఆకాంక్ష‌లు ఇలా.. ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపుపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. దీంతో ఆదివారం అర్ధ‌రాత్రి దాటాకైనా ఓ క్లారిటీ వ‌స్తుంద‌ని భావించిన నేత‌ల‌కు బాబు నుంచి ఎలాంటి సిగ్న‌ల్స్ రాలేదు. దీంతో త‌మ‌కే సీటు వ‌స్తుంద‌ని, తాము ప‌క్కాగా మండ‌లిలో కాలు పెడ‌తామ‌ని భావించిన నేత‌ల్లో టెన్ష‌న్ పీక్ స్టేజ్‌కి చేరిపోయింది.

ముఖ్యంగా దళిత సామాజిక వ‌ర్గం నుంచి పెద్ద ఎత్తున పోటీ పెరుగుతోంది. ఈ లైన్‌లో జూపూడి ప్ర‌భాక‌రరావు ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే, ఇప్ప‌టికే ఎమ్మెల్సీగా ఉన్న ప్ర‌తిభా భార‌తి త‌న‌ను మ‌రోసారి రెన్యువ‌ల్ చేయాల‌ని కోరుతున్న‌ట్టు తెలిసింది. ఇక‌,  అదే వర్గానికి చెందిన డొక్కా మాణిక్యవరప్రసాద్ తీవ్ర య‌త్నాల్లో ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత – మాజీ మంత్రి పుష్పరాజ్ కూడా ఇప్పుడు బాబు ద‌గ్గ‌ర క్యూక‌ట్టారు.  ప్రకాశం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం – పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ముళ్లపూడి రేణుక – చిత్తూరు జిల్లా నుంచి దొరబాబు – అనంతపురం నుంచి సుబ్రమణ్యం ప్రయత్నిస్తున్నారు.

ఇలా టీడీపీలో హేమా హేమీలైన వారంతా రంగంలో ఉండ‌డం.. చంద్ర‌బాబు ఇంకా ఎలాంటి నిర్ణ‌య‌మూ తీసుకోక‌పోవ‌డం నేప‌థ్యంలో నేత‌ల మ‌ధ్య టెన్ష‌న్ నానాటికీ పెరుగుతోంది. మ‌రి బాబు దీనిని ఎలా ప‌రిష్క‌రిస్తారో చూడాలి. ఇక‌, చంద్ర‌బాబు బావ‌, అన్న‌గారి పెద్ద కుమారుడు నంద‌మూరి హ‌రికృష్ణ కూడా లైన్‌లోకి వ‌చ్చేశాడు. ఇక‌, సీఎం త‌న‌యుడు లోకేష్‌ను ఎలాగూ మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఇప్ప‌టికే ఓ సీటు ఖ‌రారైంది. దీంతో ఇప్పుడు టీడీపీ నేత‌ను ఎవ‌రిని క‌దిపినా.. ఎమ్మెల్సీల గురించే చ‌ర్చించుకుంటుండ‌డం గ‌మ‌నార్హం.