దీపావళికి రెండో విశ్వరూపం

ఒక సినిమా విడుదల కాకముందు ఆ చిత్రం తాలూకు పోస్టర్లు చూసి, ‘ఇలా ఉంటుంది’ అని ఓ నిర్ణయానికి వచ్చేస్తారు. దాంతో పాటు అందులో వివాదాస్పద అంశాలేమైనా ఉండి ఉంటాయేమోనని అనుమానిస్తారు. ఆ విధంగా కొన్ని సినిమాలు విడుదల కాకముందే వివాదాల్లో ఇరుక్కుంటుంటాయి. కమల్హాసన్ నటించి, స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన ‘విశ్వరూపం’ అందుకో ఉదాహరణ. మూడేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా పలు వివాదాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. చివరికి ‘దేశం వదిలి వెళ్లిపోతా’ అని కమల్ బహిరంగంగా బాధను వ్యక్తం చేసిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది. వాస్తవానికి తొలి భాగం తీస్తున్నప్పుడే మలి భాగాన్ని కూడా కమల్ ప్లాన్ చేశారు. ఫస్ట్ పార్ట్ చిత్రీకరణ సమయంలోనే ‘విశ్వరూపం-2’కి సంబంధించిన పలు కీలక సన్నివేశాలను కూడా తీశారు. కానీ, ఇప్పటివరకూ ఈ చిత్రం తెరకు రాలేదు.దాంతో మలి భాగం ఏమైంది? అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. ‘విశ్వరూపం’ తర్వాత కమల్ ‘పాపనాశం’, ‘ఉత్తమవిలన్’, ‘చీకటి రాజ్యం’ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ‘శభాష్ నాయుడు’ చిత్రం చేస్తున్నారు. దాంతో ‘విశ్వరూపం-2’ని ఆపేశారేమో అన్నది కొంతమంది ఊహ. కానీ, ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారట.ఒక పాట, కొంత ప్యాచ్ వర్క్ మినహా ఈ సినిమా పూర్తయిందట. ‘శభాష్ నాయుడు’ పూర్తి కాగానే, ‘విశ్వరూపం-2’ పనులు మొదలుపెట్టాలని కమల్ అనుకుంటున్నారని సమాచారం. దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారనే టాక్ చెన్నై కోడంబాక్కమ్లో ప్రచారమవుతోంది. ఈలోపే ‘శభాష్ నాయుడు’ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.