ఏపీలో సీఎం చంద్రబాబు తర్వాత అత్యంత కీలకమైన పొజిషన్ ఉన్నారు నారాయణ విద్యాసంస్థల అధినేత పి నారాయణ. మునిసిపల్ శాఖా మంత్రిగానే కాకుండా రాజధాని అమరావతి నిర్మాణం, సీఆర్ డీఏ చైర్మన్గా ఆయన కీలక చక్రం తిప్పుతున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే.. తన సొంత జిల్లా నెల్లూరుపై నారాయణ మంచి పట్టు సాధించారు. ఇది ఇప్పటి వరకు ఉన్న మ్యాటర్. అయితే, రోజులన్నీ ఒకేలా ఉండవు.. పదవులన్నీ శాశ్వతంగా ఉండవు కదా! ఇప్పుడు నారాయణ పరిస్థితి కూడా అలానే ఉందట. త్వరలోనే ఆయనను మంత్రి వర్గం నుంచి సాగనంపాలని బాబు యోచిస్తున్నారట.
అంతటితో సీన్ అయిపోతే కథ బాగానే ఉండేది. కానీ, నెల్లూరుకే చెందిన కాంగ్రెస్ నుంచి జంప్ చేసి సైకిలెక్కిన ఆనం బ్రదర్స్లో పెద్దాయన రామనాయణ రెడ్డికి బాబు నారాయణ పదవిని కట్టబెడుతున్నారట. దీంతో ఇప్పుడు జిల్లాలో ఏ టీకొట్లో చూసినా.. నారాయణ గురించే చర్చ నడుస్తొంది. నారాయణను తప్పించి ఆనం కి ఈ పదవిని అప్పగించడం ద్వారా నెల్లూరులో టీడీపీని మరింత బలోపేతం చేసుకోవడంతోపాటు.. రానున్న రోజుల్లో రెడ్డి సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకోవాలని బాబు వ్యూహం సిద్ధం చేసుకున్నారట.
ఈ నేపథ్యంలో మంత్రి నారాయణను తప్పిస్తున్నారని సమాచారం. త్వరలోనే రాష్ట్ర మంత్రి వర్గంలో కీలకమైన మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా మరో రెండేళ్లలో రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్లనున్న తరుణంలో జగన్ను ఎదుర్కొనే స్థాయి ఉన్న వారినే మంత్రులుగా నియమించాలని బాబు ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అదేసమయంలో తన కుమారుడు లోకేష్ని మంత్రిని చేస్తున్నారట. అయితే, నారాయణను ఆ పదవి నుంచి తొలగించినా.. ఆయనకు సీఆర్ డీఏ చైర్మన్ పదవిని మాత్రం దూరం చేయబోరని సమాచారం. అంతేకాకుండా ఆ పదవికి కేబినెట్ హోదా కూడా కట్టబెడతారట చంద్రబాబు. మరి ఏం జరుగుతుందో చూడాలి .