ఎమ్మెల్సీ ఆశావహుల జాబితా కొండవీటి చాంతాడులా పెరిగిపోతోంది. ఎవరికి ఈ అవకాశం దక్కుతుంతోనని ఆశావహులు వేయికళ్లతో ఎదుచూస్తున్నారు. ఇదే సందర్భంలో పార్టీలోకి వచ్చిన వారితో పాటు, సీనియర్లకు, అసంతృప్తులకు ఈసారి ఎమ్మెల్సీ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఈ జాబితాలో తానూ ఉన్నానని చెబుతున్నారు మహిళా నేత కవిత. ఈ విషయంపై ఆమె తన అసంతృప్తిని ఒక సమావేశంలో చంద్రబాబుపై వెళ్లగక్కారు. అయితే తనపై విమర్శలు చేసినా.. ఆమెకు ఈసారి ఎలాగైనా ఎమ్మెల్సీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.
సినీ రంగం నుంచి టీడీపీలో చేరిన వారికి కొదవేలేదు. ముఖ్యంగా ఒకప్పుడు హీరోయిన్గా అలరించిన కవిత ప్రస్తుతం టీడీపీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. అయితే పార్టీ కోసం ఎంతలా శ్రమిస్తున్నా.. అందుకు తగిన గుర్తింపు రావడం లేదని ఆమె కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నారట. ఇప్పటికైనా తనను గుర్తించాలని ఆమె కోరుకుంటున్నారు. అంతేకాదు ఒకపక్క ఎమ్మెల్సీగా ఎవరిని ఎంపిక చేయాలో తెలియక అధినేత చంద్రబాబు తలమునకలవుతుంటే.. ఈ జాబితాలో తనకూ అవకాశం ఇస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్తో కలిసి శ్రమించినా గుర్తింపు మాత్రం దక్కలేదని, పార్టీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అన్నీ తానై పార్టీకి ఎంతో సేవ చేశానని వాపోయారు. ప్రస్తుతం ఏపీ విభజన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చినా తనను పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా ఆ విమర్శలను పట్టించుకోకుండా బాబు కవిత పేరును ఎమ్మెల్సీ సీటుకి పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పొలిట్ బ్యూరో సమావేశంలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపై చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారట. అందులో ఈ విషయంపైనా చర్చ జరిగిందట.
ఎప్పటి నుంచో పార్టీలో ఉంటూ.. ఎలాంటి పదవీ లేకుండా సేవ చేస్తున్నవారికి ఇప్పుడు ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. 2019లో ఎట్టిపరిస్థితిలోనూ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని డిసైడ్ అయిన చంద్రబాబు.. ఇప్పటినుంచే ఆ వ్యూహాలు అమలుచేస్తున్నారు. ఈ నేపథ్యలోనే అసంతృప్త సీనియర్లను బుజ్జగించేందుకు కొందరినైనా ఎమ్మెల్సీలుగా చేయాలని భావిస్తున్నారట.