కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా చేపట్టనున్న సత్యాగ్రహ పాదయాత్రపై చంద్రబాబు ప్రభుత్వం అష్టదిగ్బంధనం ప్రకటించిందా? గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా పద్మనాభం తన యాత్రను వాయిదా వేసుకోక తప్పని స్థితి వస్తోందా? ప్రభుత్వం గతంలోకన్నా మరింత ఎక్కువ కఠినంగా వ్యవహరిస్తోందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. కాపు ఉద్యమానికి ముఖ్యంగా ముద్రగడ ఉద్యమానికి ఎలాంటి ఆదరణా లభించకూడదన్న ఏకైక అజెండాతో చంద్రబాబు ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేసింది.
ఈ క్రమంలో తాజాగా పద్మనాభం చేపడతానని ప్రకటించిన సత్యాగ్రహ దీక్ష ప్రారంభం కాకుండానే బాబు ప్రభుత్వం సకల ఆంక్షలతో సవాలక్ష ఆదేశాలతో అప్రకటిత కర్ఫ్యూ ప్రకటిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముద్రగడ వార్తలను ఎట్టి పరిస్థితిలోనూ ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని మీడియా సంస్థలకు హుకుం జారీ చేసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా స్థానిక నెట్ వైరల్ను కూడా నిలిపి వేయాలని, ఫలితంగా సోషల్ మీడియా కూడా పూర్తిగా సుప్త చేతనావస్థలోకి వెళ్లిపోతుందని ఫలితంగా ముద్రగడం యాత్ర ఫెయిల్ అయిపోతుందని బాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాని వేల మంది పోలీసులు తమ స్వాధీనం లోకి తీసేసుకున్నారు. మరోపక్క, కాపు నేతల కదలికపై నిఘా ఉంచారు. వీధుల్లో కవాతు నిర్వహిస్తున్నారు. కర్ణాటక నుంచి రాపిడ్ యాక్షన్ బలగాలను రప్పించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. మరి ఇలాంటి కఠిన నిర్ణయాల నేపథ్యంలో ముద్రగడ యాత్ర సాగుతుందా? లేదా? గతంలో మాదిరిగానే వాయిదా పడుతుందా? అనేది వేచి చూడాల్సి ఉంది.