పరిటాల శ్రీరామ్ ఎంట్రీ ఇవ్వాలంటే సునీత డిసైడ్ కావాల్సిందే !

అనంత‌పురం పాలిటిక్స్ గురించి చెప్పుకొంటే ముందుగా మాట్లాడేది ప‌రిటాల ర‌వి ఆయ‌న కుటుంబ రాజ‌కీయాల గురించే. ర‌వి ఇప్పుడు లేక‌పోయినా కూడా  ఆయ‌న భార్య‌, కుమారుడు శ్రీరామ్ మాత్రం చ‌క్రం తిప్పుతున్నారు. ఇక‌, ఈ జిల్లాలో ర‌వి ఉండ‌గా టీడీపీకి ఎదురు లేకుండా పోయింది. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి మారింది. జిల్లా మొత్తంగా టీడీపీ ఆధిప‌త్యం ఉన్న‌ప్ప‌టికీ.. వ‌ర్గాలుగా మాత్రం చీలిపోయారు. ఆదినుంచి ప‌రిటాల వ‌ర్గానికి ప‌ట్టున్న ధ‌ర్మ‌వ‌రంలో వ‌ర‌దాపురం సూరి పాగా వేశాడు. దీంతో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప‌రిటాల వ‌ర్గం ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక ర‌గ‌డ సృష్టిస్తోంది.

ఇక‌, 2019 ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో మంత్రి ప‌రిటాల సునీత త‌న త‌న‌యుడు ప‌రిటాల ర‌విని ఎలాగైనా ఎమ్మెల్యేను చేయాల‌ని డిసైడ్ అయ్యారు. అయితే, ప్ర‌స్తుతం ఆమె ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాప్తాడు నుంచి శ్రీరామ్‌ను రంగంలోకి దింపాలా?  లేక త‌మ‌కు ఎగ‌స్పార్టీగా ఉన్న ధ‌ర్మవ‌రం సీటు నుంచి సూరిని ఖాళీ చేయించి అక్క‌డి నుంచి శ్రీరామ్‌కి ఎంట్రీ ఇవ్వాలా? అనేది డిసైడ్ కావాల్సి ఉంది. అయితే, ఈ విష‌యంలో మాత్రం సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్‌గానే ఉన్నారు.

ధ‌ర్మ‌వ‌రంలో సూరి, ప‌రిటాల వ‌ర్గాల మ‌ధ్య జ‌రుగుతున్న ఘ‌ర్ష‌ణ‌ల‌పై ఆయ‌న ఫైర‌య్యారు. ఇలాంటి గొడ‌వ‌లు మంచివి కావ‌ని ప‌రిటాల సునీతకి తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు ఆమె ధ‌ర్మవ‌రం సీటుపై ఆశ‌లు వ‌దులుకోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంద‌ని తెలుస్తోంది. అయితే, ఇక‌, మిగిలింది రాప్తాడు లేదా పెనుగొండ. రాప్తాడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో తాను త్యాగం చేయ‌డం ఒక్క‌టే మార్గం.

అలా కాకుండా పెనుగొండ‌లో సీటుపై క‌న్నేస్తే.. అక్క‌డి సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థ‌సార‌థిని త‌ప్పించ‌డం ఒక్క‌డే మార్గం . మ‌రి ఈ రెండింటిలో ఏదిశ‌గా వెళ్తార‌నేది వేచి చూడాలి. మొత్తానికి 2019 ఎన్నిక‌ల‌కు సంబంధించి ప‌రిటాల శ్రీరామ్ ఎంట్రీ ఖాయంగానే క‌నిపిస్తోంది.