ఏపీలో ప్రధాన విపక్షంగా ఉన్న వైకాపా అధినేత జగన్ ఇప్పుడు జనసేనాని పవన్తో పొత్తుకు తహతహ లాడుతున్నారా? ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు పవన్ పక్కన చేరేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారా? సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడేందుకు జగన్.. జనసేనానితో కలిసేందుకు గ్రీన్ సిగ్నల్ చూపిస్తున్నారా? అంటే ఔననే ఆన్సరే వస్తోంది. ముఖ్యంగా వైకాపా ఎంపీ, జగన్కి అత్యంత సన్నిహితుడు విజయసాయి రెడ్డి నుంచే ఈ విధమైన సిగ్నళ్లు రావడం ఇప్పుడు రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది.
ఇటీవల చేనేత సంఘాల నేతలు పవన్ని హైదరాబాద్లో కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలు విన్న పవన్.. వారికి మద్దతిస్తానని ప్రకటించారు. అదే సమయంలో మరోసారి హోదా విషయాన్ని పవన్ ప్రస్తావించారు. హోదా విషయంలో తాను ఎవరితోనైనా కలిసి పోరాడేందుకు రెడీ అని పవన్ చెప్పాడు. ముఖ్యంగా సీపీఐ, సీపీఎం నేతలు సహా ఏ పార్టీ అంటే.. ఏపీ విపక్షం వైకాపాతోనూ కలిసేందుకు తాను రెడీ అని పవన్ చెప్పకనే చెప్పాడు. అయితే, ఈ విషయంపై దాదాపు రెండు రోజుల పాటు కసరత్తు చేసిన వైకాపా పవన్ కామెంట్లను స్వాగతించింది.
ఈ క్రమంలో.. వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హోదా విషయంలో తాము అందరినీ కలుపుకొని పోతామన్నారు. అయితే.. కాంగ్రెస్ – బీజేపీతో మాత్రం కలిసేది లేదని విజయసాయి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి తీరని ద్రోహం చేసిందని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు ఎన్నడూ విశ్వసించే అవకాశం లేదని అటువంటి ద్రోహం చేసిన పార్టీతో తాము సంబంధాలు పెట్టుకోబోమని తేల్చేశారు. బీజేపీతో సంబంధాలకు కూడా తాము సిద్ధంగా లేమనన్నారు. బీజేపీతో పొత్తు కోసం గతంలోనే ఆఫర్ వచ్చినా తాము ఆసక్తి చూపలేదని చెప్పేశారు.
అయితే, ఇప్పుడీ వ్యాఖ్యలు టీడీపీలో గుబులు రేపుతున్నాయి. నిజంగానే పవన్ జగన్తో దోస్తీ కడితే.. టీడీపీ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. మరి ఈ విషయంపై బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏదేమైనా హోదా విషయంలో పవన్, జగన్ చేతులు కలుపుతున్నారనే వార్త మాత్రం రాష్ట్రంలో సంచలనంగా మారింది.