పవన్ ని ఫాలో అవుతున్న జగన్!

ఏపీలో ఏకైక విప‌క్షంగా ఉన్న వైకాపా అధినేత జ‌గ‌న్.. జ‌న‌సేనానిని ఫాలో అవుతున్నాడా? త‌న‌కు ఆద‌ర‌ణ త‌గ్గుతోంద‌ని గ్ర‌హించి.. ప‌వ‌న్ మార్గంలో న‌డుస్తున్నాడా?  ప‌లు ఉద్య‌మాలు చేప‌ట్టినా అవి ఆశించ‌న స్థాయిలో సక్సెస్ కాక‌పోవ‌డంతో ఆయ‌న ఇప్పుడు ప‌వ‌న్‌ని ఫాలో అవ్వ‌క త‌ప్ప‌డం లేదా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. నిజానికి ఇటీవ‌ల ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైకాపా అధినేత జ‌గ‌న్ క‌న్నా.. జ‌న‌సేనాని ప‌వ‌నే దూకుడుగా ఉంటున్నాడు. ప్ర‌జ‌లు కూడా ప‌వ‌న్ వ‌ద్ద‌కే నేరుగా వెళ్లి స‌మ‌స్య‌లు చెప్పుకొంటున్నారు. మొన్న‌టికి మొన్న శ్రీకాకుళం కిడ్నీల బాధితుల విష‌యం మీడియాలో వ‌చ్చాక ఫ‌స్ట్ స్పందించింది ప‌వ‌న్‌. ఆ త‌ర్వాత తీరుబ‌డిగా వెళ్లి.. ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లాడు జ‌గ‌న్‌.

అంతేకాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విష‌యంలోనూ జ‌గ‌న్‌.. ప‌వ‌న్‌నే ఆద‌ర్శంగా తీసుకున్నాడ‌ని కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజానికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న నేత‌.. హోదా కోసం రాష్ట్రం మొత్తాన్ని క‌దిలించాల్సిన నేత నిన్న మొన్న‌టి వ‌ర‌కు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు త‌మిళ‌నాడు జ‌ల్లి క‌ట్టు దెబ్బ‌తో ఫ‌స్ట్ రియాక్ట్ అయిన ఏపీ యువ‌త.. తంబిలకున్న పౌరుషం తెలుగు వాళ్ల‌కి లేదా.. అని సోష‌ల్ మీడియాలో కామెంట్ల‌తో కుమ్మేశారు. దీంతో స్పాట్‌లో స్పందించిన ప‌వ‌న్‌.. యువ‌త‌కు అండ‌గా నిల‌బ‌డ్డారు. తాను కూడా అండ‌గా నిల‌బ‌డ‌తాన‌ని, కేంద్రం మెడ‌లు వంచైనా సాధిద్దామ‌ని ట్వీట్ చేశాడు.

ఇదంతా జ‌రిగి దాదాపు 24 గంట‌ల గ‌డిచిపోయాక‌.. త‌గుదున‌మ్మా అంటూ.. జ‌గ‌న్ స్పందించ‌డం.. కాదు కాదు.. ప‌వ‌న్‌ని అనుక‌రించ‌డం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద కామెడీగా మారింది. హోదా కోసం పోరాడే యువ‌త‌కు అన్ని విధాలా తాను స‌హ‌క‌రిస్తాన‌ని జ‌గ‌న్ ట్వీట్ చేశాడు. వాస్త‌వానికి ఇలాంటి ప్ర‌ధాన విష‌యాల‌పై ముందుండి యువ‌త‌ను న‌డిపించాల్సిన జ‌గ‌న్ ఇలా మారిపోయాడేంటాని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌డానికి మ‌రో రెండేళ్ల స‌మ‌య‌మే ఉంది. ఈ క్ర‌మంలో నూత‌న ఆలోచ‌న‌లు, ఉద్య‌మాల‌తో యువ‌త‌ను ఆక‌ట్టుకోవాల్సిన జ‌గ‌న్‌.. ఇలా .. కాపీ కొట్టే కార్య‌క్ర‌మాల‌కు తెర‌దీయడం ఏంట‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ అండ్ కో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.