పురందేశ్వరి జగన్ పంచన చేరి జై కొట్టడం ఖాయం

దివంగ‌త ఎన్‌టీఆర్ ముద్దుల కుమార్తె నంద‌మూరి ఇంటి చిన్న‌మ్మ‌.. పురందేశ్వ‌రి త్వ‌ర‌లోనే జ‌గ‌న్ పంచ‌కు చేరిపోతున్నారు. 2009లో కాంగ్రెస్ త‌రఫున విశాఖ నుంచి ఎంపీగా గెలిచిన చిన్న‌మ్మ కేంద్రంలో మంత్రిగా చ‌క్రం బాగానే తిప్పారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్‌కు రాం రాం చెప్పి.. బీజేపీలో చేరిపోయారు. అయితే, అనుకున్నంత స్థాయిలో ఆమెకు గుర్తింపు రాలేదు. పైగా క‌మ‌ల నాథుల నుంచి నోరు జాగ్ర‌త్త‌.. చంద్ర‌బాబును ఏమీ అనొద్దు వంటి ఆదేశాల‌తో ఆమె త‌న‌లో తానే కుమిలిపోయిన‌ట్టు అనుచ‌రులు చెప్పుకొన్నారు.

వాస్త‌వానికి ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ఒంటి కాలుపై లేచే పురందేశ్వ‌రి.. బీజేపీ అధిష్టానం ఆదేశాల‌తో నోరు క‌ట్టేసుకోవాల్సి వ‌చ్చింది. దీంతో ఇక బీజేపీలో ఇమ‌డ‌లేన‌ని ఆమె డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం. దీనికితోడు ఏపీలో బీజేపీ ఇప్ప‌ట్లో పుంజుకునే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. అంతేకాకుండా 2014లో తాను ఎలాగూ ఓడిపోయింది. దీంతో 2019లో నైనా గెల‌వ‌డం త‌ప్ప‌నిస‌రి అనే ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో పురందేశ్వ‌రి బీజేపీ నుంచి జంప్ చేసి జ‌గ‌న్ పార్టీలోకి చేరాల‌ని డిసైడ్ అయింద‌ట‌.

ఈ నేప‌థ్యంలో వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా.. పురందేశ్వ‌రికి మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేశార‌ట‌. జ‌గ‌న్ ద‌గ్గ‌ర పురందేశ్వ‌రికి రెడ్ కార్పెట్ ప‌రిచేలా అన్నీ చ‌క్క‌దిద్దార‌ట‌. అంతేకాకుండా 2019లో విశాఖ నుంచే పురందేశ్వ‌రి పోటీ చేసేందుకు జ‌గ‌న్ ఓకే చెప్పార‌ని కూడా తెలిసింది. ఈ నేప‌థ్యంలో అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే.. త్వ‌ర‌లోనే పురందేశ్వ‌రి జ‌గ‌న్ పంచ‌న చేరి జై కొట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అంతేకాకుండా.. వైసీపీలోకి చేరితే నోటి నిండా చంద్ర‌బాబును తిట్టే ఛాన్స్ పురందేశ్వ‌రికి వ‌స్తుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.