ప్రతిపక్ష వైసీపీలో గెలిచి.. సైకిలెక్కి మంత్రి పదవి పొందిన మంత్రులకు స్థానిక టీడీపీ నేతలు షాక్ ఇస్తున్నారు. ఇటీవలే వీరికి మంత్రి పదవులు ఇవ్వడంపై ఆగ్రహ జ్వాలలు చెలరేగడం.. వాటని తన చాకచక్యంతో సీఎం చంద్రబాబు అణగదొక్కడం ఇవన్నీ తెలిసిందే! అయితే పరిస్థితి అంతా సద్దుమణిగిందని భావించినా.. ప్రస్తుతం ఇంకా ఈ జ్వాలలు ఇంకా చల్లారలేదు. ఆ మంత్రులను తమలో కలుపుకునే పరిస్థితి టీడీపీలో లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి సుజయ్ కృష్ణ రంగాకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది.
విజయనగరం జిల్లాకు చెందిన బొబ్బిలి రాజు సుజయ కృష్ణ రంగా వైకాపా నుంచి వచ్చి చేరాక.. మంత్రి అయ్యారు! దీంతో స్థానికంగా ఆయన కేడర్ సంబరాలు చేసుకుంది. కానీ, జిల్లాలో టీడీపీ నుంచి ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. జెడ్పీ సమావేశానికి ఆయన వస్తున్నట్టు ముందుగానే చెప్పారట. ఆయన ఎలాగూ మంత్రి కాబట్టి.. జిల్లాలోని ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాస్థాయి నేతలు వస్తారని అనుకుంటారు. కానీ, వారంతా మూకుమ్మడిగా ఈ సమావేశానికి గైర్హాజరయ్యారై మంత్రికి ఝలక్ ఇచ్చారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేగా పార్టీలో చేరిన నాయకుడికి ఎమ్మెల్యే పదవి కట్టబెట్టడంపై నిరసన తెలియజేసేందుకే గైర్హాజరు అయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నాయకులు కొండపల్లి అప్పలనాయుడు, మాజీ మంత్రి మృణాళిని కూడా సమావేశానికి రాలేదు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా రాలేదు. జెడ్పీ సమావేశంలో పాల్గొనే ముందే.. సభ్యులతో మంత్రి మాట్లాడరనీ, సమావేశంలో ఎలాంటి నిరసనలకూ ఆస్కారం లేకుండా ముందస్తు జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. వాళ్లనైతే బాగానే ఒప్పించగలిగారు.. కానీ, ఇతర టీడీపీ నేతలతో మాత్రం చర్చించడంలో విఫలమయ్యారు.
జిల్లా నేతలంతా మూకుమ్మడిగా ఇలా నిరసన వ్యక్తం చేయడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారట కొత్త మంత్రి! మరి అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళతానని, ఎటువంటి గ్యాప్నకు ఆస్కారం ఉండదని చెప్పిన ఆయనకు తొలినాళ్లలోనే ఇలాంటి నిరసన ఎదురైతే.. ఇక రానున్న కాలంలో పరిస్థితి ఇంకెలా ఉంటుందో చూడాల్సిందే!! ఫిరాయింపు దారులకు మంత్రి పదవులు ఇవ్వడమే ఇలాంటి పరిస్థితులకు మూలం అనే కారణాన్ని సీఎం చంద్రబాబు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారా లేక పరిస్థితులు అవే సర్దుకుంటాయని లైట్ తీసుకుంటారో!!