బాబు దెబ్బకి ఏపీ మంత్రులకు నిద్ర పట్టడం లేదా..?

శివ‌రాత్రి చేసుకునేందుకు క‌నీసంలో క‌నీసం మ‌రో 20 రోజుల స‌మ‌యం ఉంది. అయితే, ఇది సాధార‌ణ జ‌నాల‌కి. కానీ, ఏపీ మంత్రుల‌కి మాత్రం శివ‌రాత్రి జాగారం అప్పుడే వ‌చ్చేసింద‌ట‌!! అది కూడా నిత్యం త‌మ మ‌ధ్యే తిరుగాడే టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చిన‌బాబే మంత్రుల‌కు శివ‌రాత్రి తీసుకొచ్చార‌ట‌! విన‌డానికి ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజం అంటున్నారు ఒక‌రిద్ద‌రు మంత్రులు! ముఖ్యంగా మంత్రులు చింతకాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు, గంటా శ్రీనివాస‌రావు, రావెల కిషోర్ బాబు, ప్ర‌త్తిపాటి పుల్లారావుల‌కు నిద్ర‌మాత్ర‌లేసుకున్నా.. ప‌నిచేయ‌ని ప‌రిస్థితిలో ఉన్నార‌ట‌! ఇదంతా ఎందుకంటారా? అయితే, ఇది చ‌ద‌వండి!

ఏపీ సీఎం తాజాగా ఓ నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న కుమారుడు టీడీపీ జాతీయ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌కి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌నున్న‌ట్టు ఆయ‌న త‌న అంత‌రింగిక మంత్రుల‌తో చెప్పార‌ట‌. ఈ విష‌యం అన్ని ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లోనూ ప్ర‌ముఖంగా వ‌చ్చింది. అయితే, దీనికి బాధ‌ప‌డాల్సిందేమిటి? అంటారా? అక్క‌డే ఉంది అస‌లు ట్విస్టంతా! ఇప్పుడున్న లెక్క‌ల ప్ర‌కారం ఒక‌రు ఇన్ అయితే, ఒక‌రు అవుట్ అనే ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలో చిన‌బాబును మంత్రి వ‌ర్గంలోకి తీసుకుంటే.. ఎవ‌రి శాఖ‌కు ఎస‌రు వ‌స్తుంది? ఎవ‌రికి చంద్ర‌బాబు మంగ‌ళం పాడ‌తారు? అని పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది.

వాస్త‌వానికి చిన‌బాబు మంత్రి కావ‌డం అనేది ఇప్ప‌టికిప్పుడు జ‌రిగిన చ‌ర్చ‌కాద‌నేది అంద‌రికీ తెలిసిందే. కానీ, ఏ పోర్ట్ ఫోలియో అప్ప‌గిస్తార‌నేదే ఇప్పుడు చ‌ర్చ‌. దీంతో ఇప్ప‌టికే మంత్రులుగా ఒకింత చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మైన‌స్ మార్కులు ప‌డ్డ వారంతా త‌మ సీట్ల‌కు ఎస‌రు త‌ప్ప‌ద‌ని భావిస్తున్నార‌ట‌. వారిలో అయ్య‌న్న‌, గంటా, మృణాళిని పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తుంటే.. రావెల‌, ప్ర‌త్తిపాటి పేర్లూ అంత‌క‌న్నా ఎక్కువ‌గానే వినిపిస్తున్నాయి. వీరివి కీల‌క శాఖ‌లు కావ‌డం, వీరి ప‌నితీరుపై బాబు అసంతృప్తిగా ఉండ‌డం, వీరిపై ఆరోప‌ణ‌లు ఉండ‌డం ఇలా క‌ర్ణుడి చావుకి అన్నీ క‌లిసొచ్చిన‌ట్టు ఈ మంత్రుల‌కు అన్నీ క‌లిసొస్తున్నాయ‌ట‌. దీంతో వీరిలో ఎవ‌రికీ నిద్ర ప‌ట్ట‌డం లేద‌ని తెలుస్తోంది. మ‌రి బాబు ఎలాంటి ఫార్ములా అవ‌లంబిస్తారో? ఎవ‌రికి ఉద్వాస‌న ప‌లుకుతారో తెలియాలంటే.. ప‌ది ప‌దేహేను రోజులు వెయిట్ చేయాల్సిందే!! మ‌రి అప్ప‌టి దాకా ఈ మంత్రుల‌కు నిద్ర ప‌ట్ట‌డం క‌ష్ట‌మే మ‌రి!!