బాబు మజాకా … దెబ్బకి రావెల విలవిల

ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు వ్య‌వ‌హారం రోజురోజుకూ పార్టీకి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు తీసుకొస్తోంది. అటు పార్టీలోనూ, ఇటు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త అధిక‌మ‌వుతోంది. కొద్ది గంటల పాటు.. సెక్యూరిటీని సైతం ప‌క్క‌న‌పెట్టి వెళ్ల‌డంతో రావెల‌పై పార్టీలో నిఘా పెరిగింది. అయితే ఇంత అవ‌కాశ‌మిచ్చినా రావెలలో మార్పు రాక‌పోవ‌డంతో చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ రంగంలోకి దిగారు. మంత్రి పోర్ట్ పోలియోకు సంబంధించిన వ్య‌వ‌హారాల‌న్నింటినీ ద‌గ్గ‌రుండి మ‌రీ ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇక లోకేష్‌ క‌నుస‌న్న‌ల్లోనే రావెల విధులు నిర్వ‌ర్తించేలా ఏర్పాట్లుచేశారు.

ఏపీ సీఎం చంద్ర‌బాబు క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారు పేరు అనే విష‌యం తెలిసిందే! ఎవ‌రు త‌ప్పు చేసినా వారిపై వేటు వేయ‌డం మాత్రం ఖాయం!! అయితే ఈ వ్య‌వ‌హారాల‌న్నింటినీ కొద్ది కాలం నుంచి ఆయ‌న త‌న‌యుడు లోకేష్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ప్ర‌స్తుతం రావెల అంశాన్ని కూడా ఆయ‌న సీరియ‌స్‌గా తీసుకున్నారు. చంద్రబాబు మెప్పు కోసం రోజూ జగన్ ను తిడుతున్నా ఆయనంటే చంద్రబాబుకు కానీ లోకేశ్ కు కానీ నమ్మకం లేద‌ట‌.

ఇటీవల రావెల కిషోర్ బాబు రాత్రిపూట గుంటూరులో తన గన్ మెన్ లను సైతం పక్కన బెట్టి కొన్ని గంట‌లు క‌నిపించ‌లేదు. ఆయ‌న ఎక్క‌డకు వెళ్లారు.. ఏం చేశారు అనేది అంతా స‌స్పెన్స్‌గానే ఉంది. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ వెళ్లింది. దీనిపై నిఘావ‌ర్గాలతో విచార‌ణ చేయించ‌గా.. ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ప్ర‌తిప‌క్ష పార్టీకి చెందిన ఒక ఎంపీతో ఆయ‌న మంత‌నాలు జ‌రిపిన‌ట్టు ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు నివేదిక సమ‌ర్పించాయి. దీంతో రావెల ఏవో రహస్య వ్యవహారాలు నడుపుతున్నారని చంద్రబాబు అనుమానిస్తున్నారట.

అంతకుముందు గుంటూరు జడ్పీ ఛైర్మన్ విషయంలో మంత్రి రావెల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఎస్సీ, ముస్లింల సమస్యగా అది రాజుకొనడంతో ముఖ్యమంత్రి అప్రమత్తం అయ్యారు. వెంట‌నే రంగంలోకి దిగి కమిటీ వేసి మరీ ఈ సమస్యను పరిష్కరించారు. దీంతో ఆయనపై చంద్ర‌బాబు నిఘా పెట్టారట. ఆ బాధ్యతలు లోకేష్ కు అప్పగించారట. రావెల వద్దకు వెళ్లే ప్రతి ఫైలు లోకేశ్ వద్దకు వెళ్లాల్సిందేనట. రావెలకు చెందిన ఫైళ్లన్నీ ఇపుడు లోకేష్ కు వెళ్లిన తర్వాతనే క్లియర్ అవుతున్నాయని సమాచారం. ప్రస్తుతం రావెల పేరుకే మంత్రి కానీ ఆ శాఖ మొత్తం లోకేశ్ అండర్ లోకి వెళ్లిపోయిందట. దీంతో మంత్రి రావెల తీవ్ర అసహనం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.