కర్నూలు జిల్లా నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం.. అటు టీడీపీని, ఇటు వైసీపీ నేతలను తీవ్రంగా కలిచివేస్తోంది. ఆయన లేరన్న వార్త అందరినీ శోకసంద్రంలో నింపేస్తోంది! నాగిరెడ్డి మృతి చెందిన విషయాన్ని ఆయన బావమరిది ఎస్వీ మోహన్ రెడ్డి ధ్రువీకరించారు. ముఖ్యంగా ఆయన గుండెపోటుతో మృతిచెందారన్న విషయం.. అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మరి పెద్ద వయస్సు కాకపోయినా భూమా 53 సంవత్సరాల వయస్సులోనే ఇంత త్వరగా మృతి చెందడానికి నాలుగు కారణాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి.
భూమాకు ఇప్పటికే రెండుసార్లు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. గతంలో బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఏడాదిగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. తీవ్రమైన ఒత్తిడికి గురవ్వడం, ఇంకా పిల్లల బాధ్యతలు తనమీద ఉండడం ఆయన్ను మానసికంగా దెబ్బతీశాయి. ఇక ఆయన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి కుమారుడితో జరిగిన వైవాహిక బంధం విచ్ఛిన్నమైంది. దీనిపై కూడా ఆయన చాలా మనోవేదనతో ఉన్నాడు. ఆమె కుమార్తె వైవాహిక జీవితాన్ని సరిదిద్దేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
అన్నింటికీ మంచి ఆయన భార్య, వ్యక్తిగతంగాను, రాజకీయంగాను తోడునీడగా ఉన్న శోభా నాగిరెడ్డి ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అప్పటి నుంచి ఆయన అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా ఫిజికల్ హ్యాండీ క్యాప్డ్ అయిపోయారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయనే వెల్లడించారు. ఇక నాలుగోది మంత్రి పదవి. ముఖ్యంగా పార్టీలోకి మారిన దగ్గర నుంచి.. మంత్రి పదవి దక్కుతుందో లేదో అనేఆందోళనతో ఉన్నారు. ఒక పక్క శిల్పా వర్గం ఇందుకు గట్టిగా అడ్డుతగిలారు. చివరికి శిల్పా వర్గానికి ఎమ్మెల్సీ కేటాయించడంతో ఇక అన్నీ సర్దుకున్నాయి అనుకున్న సమయంలో ఇలా ఆయన మృతి చెందడం పార్టీ శ్రేణులను కలచివేస్తోంది.