రెండేళ్లలో తమ అధినేత సీఎం పగ్గాలు అందుకుంటాడని కలలు కంటున్న వైసీపీ నేతలకు టెన్షన్ మొదలైంది. టీడీపీ పని అయిపోయిందని, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రాజన్య రాజ్యం వస్తుందని కలలు కంటున్న కార్యకర్తల్లో కలవరం మొదలైంది. వైసీపీ అధినేత జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేయడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమ నేత జైలుకు వెళితే.. ఏంటనే ప్రశ్నలు, సందేహాలు అందరి మెదడును తొలిచేస్తున్నాయి. తర్వాత తమ భవిష్యత్తు ఏంటని ఇప్పటినుంచే కొంతమంది నేతలు.. ఆలోచిస్తున్నారట. అంతేగాక ఇదే సమయంలో టీడీపీ.. మరోసారి ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీసే అవకాశాలున్నాయని విశ్లేషకుల అంచనా!
వైసీపీ అధినేత జగన్కు కొత్త కష్టాలు మొదలయ్యాయి. అక్రమాస్తుల కేసుకు సంబంధించి.. అభియోగాలు నమోదు చేసిన వ్యక్తితో మీడియాలో ఇంటర్వ్యూ రావడం, దీనిపై సీబీఐ సీరియస్ అవడం, జగన్ బెయిల్ రద్దు చేయాలని కౌంటర్ దాఖలు చేయడం.. ఇప్పుడు వైసీపీ శిబిరంలో గుబులు పుట్టిస్తోంది. కొద్ది రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో.. ప్రభుత్వంపై జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీంతో ప్రజల్లో కొంత గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇది వైసీపీ నేతల్లో కొత్త ఆశలు చిగురించేలా చేస్తోంది.
ఇదే సమయంలో నేతల ఆశలను అడియాసలు చేస్తోంది సీబీఐ. ఇప్పుడు జగన్ బెయిల్ రద్దు చేస్తే.. పరిస్థితి ఏంటా అని అంతా అయోమయంలో ఉన్నారు. ఇంకో రెండేళ్లే సమయం ఉండటం.. నాయకుడు జైలుకు వెళ్లడం వంటి వాటిని పరిశీలిస్తే.. పార్టీలో ఉండాలా? లేక మారాలా? జగన్ తర్వాత పార్టీని సమర్థంగా నడిపించే వారెవరు? అని ఇప్పుడు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి టీడీపీకి మరింత లాభిస్తుందని విశ్లేషకుల అభిప్రాయం.
కొందరు మరో అడుగు ముందుకేసి.. టీడీపీలోకి జంప్ అయిపోతే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. అయితే ప్రత్యర్థి పార్టీలోని లుకలుకలను అధికార టీడీపీ నేతలు.. నిశితంగా గమనిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల ఆలోచనలు పసిగడితే.. మరోసారి ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీసే అవకాశాలున్నాయనేది స్పష్టమవుతోంది. ఇదే జరిగితే ఇక పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టే!!