రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ను వీడి తెలుగుదేశంలో చేరి.. ఎంపీ అయిన ఓ సీనియర్ నాయకుడు ప్రతిపక్ష వైసీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. టీడీపీలో చేరిన సమయంలో తనకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేయడం, అక్కడే ఉంటే తనకు ఎదుగుదల ఉండదని భావించి ఈ మేరకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారట. అంతేకాదు వైసీపీలో చేరేందుకు కొన్ని కొండీషన్స్ కూడా పెడుతున్నారు. వాటన్నింటికీ ప్రతిపక్ష నేత జగన్ సిద్ధమంటే వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అంటున్నారు! ఆ ఎంపీ ఎవరంటే రాయపాటి సాంబశివరావు!
గుంటూరులో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. నరసరావుపేట ఎంపీ, గుంటూరు జిల్లాను తన రాజకీయ ఖిల్లాగా మార్చుకున్న సాంబశివరావు.. ఇప్పుడు కండువా మార్చేందుకు సిద్ధమవుతున్నారు. తొలి నుంచీ కాంగ్రెస్ కల్చర్కు అలవాటుపడ్డ రాయపాటి.. గ్రూపు రాజకీయాలతో టీడీపీలో ఇమడలేకపోతున్నారట.దీంతో టీడీపీ నేతలు అక్రమాలు, అవినీతి కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారని, వాళ్ల ఆగడాలు ఎక్కువైపోయాయని బహిరంగంగా విమర్శించి కలకలం సృష్టించారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక మర్మం వేరే ఉందంటున్నారువిశ్లేషకులు.
అయితే తాను వైసీపీలో ఉంటే ఇమడగలుగుతానని గ్రహించి జగన్కు జై కొట్టాలనే ఆలోచనలో ఉన్నారట సాంబశివరావు. తనకు గుంటూరు ఎంపీ సీటు ఇవ్వాలని, వైఎస్సార్సీ గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి కానీ, టీటీడీ చైర్మన్ పదవి కానీ ఇవ్వాలని కండిషన్ పెట్టారట. అయితే జగన్ కూడా ఇందుకు సానుకూలంగానే ఉన్నారట. ఇద్దరి మధ్య చర్చలు ఫలిస్తే 2019లో గుంటూరు నుంచి వైసీపీ ఎంపీగా రాయపాటి పోటీచేయచ్చు. అసలే రాజకీయంగా సీనియర్లు పార్టీని వీడుతున్న వేళ.. ఇది జగన్కు సానుకూలాంశమే ! అయితే ఇది ఎంత వరకు జరుగుతుందో చూడాలి. రాయపాటి పార్టీ మారినా మారకపోయినా టీడీపీలో మాత్రం తీవ్ర అసంతృప్తితో రగలిపోతున్నారన్నది మాత్రం నిజమే.