మంత్రి వర్గ విస్తరణలో ఈసారి వేటు తప్పదు అని భావిస్తున్న వారిలో మంత్రి రావెల కిశోర్బాబు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కొంత కాలంనుంచి ఆయన వ్యవహార శైలి పార్టీకి తలనొప్పులు తెస్తున్న విషయం తెలిసిందే! ఇదే సమయంలో ఆయన అకస్మాత్తుగా అదృశ్యమవడం చర్చనీయాంశమైంది, దీనిపై విజిలెన్స్ కమిటీ సీఎంకు నివేదిక కూడా అందించింది. ఇందులో ఏముందో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు! ఆ సమయంలో ఆయన వైసీపీ ఎంపీతో రహస్య మంతనాలు కొనసాగించారని తేలడంతో.. ఇప్పుడు రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది.
ప్రతిపక్ష వైసీపీలో చేరే నాయకుల సంఖ్య అధికమవుతోంది. తాజాగా ఈ జాబితాలో ఏపీ మంత్రి రావెల పేరు కూడా వినిపిస్తోంది, గుంటూరు జిల్లాకు చెందిన ఆయన వ్యవహారశైలి పార్టీకి చికాకు తెప్పిస్తోంది. తొలిసారి మంత్రి అయిన తరువాత ఆయన పూర్తిగా ప్రజలకు, కార్యకర్తలకు దూరం అయి అటు వ్యక్తిగతంగా, ఇటు పార్టీకి తలనొప్పులు తీసుకొచ్చారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా ఆయనపై వేటు తప్పదని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇటీవలే ఆయనపై చంద్రబాబు కూడా అసంతృప్తి వ్యక్తంచేశారు. తనపై వేటు వేస్తే పార్టీకి గుడ్బై చెబుతానని ఆయన బెదిరిస్తున్నారట.
ఈ నేపథ్యంలోనే ఇటీవల ఒక రోజు హఠాత్తుగా ఆయన సెక్యూరిటీ సిబ్బందిని, ఇతర సిబ్బందిని వదలేసి మూడు గంటల పాటు అదృశ్యమయ్యారు. దీంతో రంగంలోకి దిగిన ఇంటిలిజెన్స్ వర్గాలు ఆయన ఎక్కడ ఉన్నారో ఆరా తీశారు. ఇంటిలిజెన్స్ వర్గాలు తెలుసుకున్న విషయం అటు ముఖ్యమంత్రిని, ఇటు పార్టీ నాయకులను షాక్కు గురిచేసిందట. మూడు గంటల పాటు అదృశ్యమైన మంత్రి రావెల వైకాపా ఎంపీ, జగన్ బంధువు వై.వి.సుబ్బారెడ్డితో రహస్యంగా భేటీ జరిపారట. తనను మంత్రి పదవి నుంచి తొలగిస్తే…తాను టిడిపిలో ఉండనని ఆయన చెబుతున్నారట.
అందుకే వైకాపా నేతలను కలసి తనను ఆ పార్టీలో చేర్చుకోవాలని రావెల కోరుతున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన జగన్ బంధువును కలశారనే చర్చ పార్టీలో జరుగుతుంది. అయితే ఆ భేటీలో ఏం జరిగిందో బయటకు తెలియడం లేదు కానీ…ఆయన వ్యవహరశైలి టీడీపీ నేతలకు మింగుడుపడడం లేదు. తొలిసారి ఎమ్మెల్యే అయినా మంత్రి పదవి ఇచ్చినందుకు ఆయన పార్టీకి ఇచ్చే బహుమానం ఇదా…? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మాత్రం రావెల టీడీపీలో ఉన్నా ? లేకపోయినా ఒరిగేది ఏమీ లేదని ఆయన లాంటి వాళ్ల వల్ల పార్టీకి నష్టమే అంటున్నారు.