వ్యూహప్రతివ్యూహాలతో జగన్ సక్సెస్..!

ఏపీలో అధికార, ప్ర‌తిప‌క్షాల వ్యూహ‌ప్ర‌తివ్యూహాలతో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. రాయ‌ల‌సీమ జిల్లాల్లో ఆధిప‌త్యం కోసం రాజకీయాలు జోరందుకున్నాయి! క‌డ‌పలో జ‌గ‌న్‌ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టేందుకు సీఎం చంద్రబాబు పావులు క‌దుపుతుంటే.. క‌ర్నూలు టీడీపీలో అసంతృప్తుల‌కు జ‌గ‌న్ గేలం వేస్తున్నారు. ప్ర‌తిప‌క్ష వైసీపీలోకి వ‌ల‌స‌లు జోరందుకున్న త‌రుణంలో.. క‌ర్నూలుకు చెందిన టీడీపీ నేత‌లు కూడా జగ‌న్ చెంత చేరేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేయ‌డం రాజ‌కీయంగా కొత్త స‌మీక‌ర‌ణాల‌కు తెర‌తీసింది!

రాయలసీమలో రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. ప్రతిపక్షనేత సొంత జిల్లా క‌డ‌ప‌లో జ‌గ‌న్‌ను దెబ్బ కొట్టాలని భావిస్తూ శరవేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నారు. కడప జిల్లాలో పట్టుసాధిస్తే రాయలసీమలో పట్టు దొరుకుతుందని ఆయన వ్యూహాలు పన్నుతున్నారు. అయితే ఆయన వ్యూహాలకు జగన్‌ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. బాబు కడపపై గురిపెడితే .. జగన్‌ కర్నూలును లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటికే ఆ జిల్లాలో బలంగా ఉన్న వైకాపాను మరింత బలోపేతం చేసేందుకు తటస్థులు, టీడీపీలోని అసంతృప్తులకు గాలం వేస్తున్నారు.

మాజీ టీడీపీ నేత, రాయ‌ల‌సీమ ప‌రిర‌క్ష‌ణ సమితి నేత‌ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డితో పాటు భూమా నాగిరెడ్డి చేరిక‌తో తీవ్ర అసంతృప్తితో ఉన్న శిల్పా మోహ‌న‌రెడ్డి ఇప్పుడు వైసీపీ  వైపు చూస్తున్నార‌ట‌! బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డిని జ‌గ‌న్ పార్టీలోకి ఆహ్వానించ‌గా అందుకు ఆయ‌న సుముఖ‌త కూడా వ్య‌క్తంచేశార‌ట‌. గ‌తంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయ‌న.. 2004 అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీకి దూరమ‌య్యారు! ఆయ‌న‌తోపాటు శిల్పామోహన్‌రెడ్డి సోద‌రులు కూడా కొంత కాలంగా పార్టీ అధినాయ‌క‌త్వంపై అసంతృప్తితో ఉన్నారు. తమ కంటే వెనుక పార్టీలో చేరిన భూమా నాగిరెడ్డికి ప్రాధాన్య‌త ఇస్తుండ‌టంతో ఆయ‌న గుర్రుగా ఉన్నారు!

అధిష్ఠానం కూడా భూమా వ‌ర్గానికే స‌పోర్ట్ చేస్తుండ‌టాన్ని వీరు స‌హించ‌లేక‌పోతున్నారు. దీంతో తాము పార్టీలో ఉండమని వారు తెగేసి చెబుతున్నారు. ఇప్పుడు వీరు కూడా పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది! అసంతృప్తిని గుర్తించిన జ‌గ‌న్ రంగంలోకి దిగారు! వీరితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు! మ‌రి వీరు వైపీపీలో  చేరితే జ‌గ‌న్‌కు రాయ‌లసీమ‌లో బ‌లం వ‌చ్చిన‌ట్టే!!