హైకోర్టులో గెలిచిన కెసిఆర్

ఎన్నికల నియమావళి ఉల్లంఘన వ్యవహారంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. 2008 ఉప ఎన్నికల సందర్భంగా ఆయనపై వివిధ పోలీస్‌స్టేషన్‌లలో నమోదైన కేసులన్నింటినీ హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 2008 ఉప ఎన్నికల్లో కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్ల సమావేశాల సందర్భంగా చంద్రశేఖరరావు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ రిటర్నింగ్ అధికారులు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుల ఆధారంగా పలు పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదు అయ్యాయి.

ఈ కేసులన్నింటినీ కొట్టేయాలని కోరుతూ కేసీఆర్ 2009లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా చంద్రశేఖరరావు తరపు న్యాయవాది గండ్ర మోహనరావు వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం, చంద్రశేఖరరావుపై వివిధ పోలీస్‌స్టేషన్‌లలో నమోదైన కేసులన్నింటినీ కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.