ప్రశ్నిస్తానంటూ పొలిటికల్ కలరింగ్ ఇచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్.. ప్రత్యేక హోదా విషయంలో అన్నంత పనీ చేశారు. కేంద్రాన్ని దుమ్ము దులిపేస్తున్నాడు. హోదా ఇస్తామని ఆనాడు చెబితేనే తాను ప్రచారం చేశానని, అప్పుడు తెలియదా? అంటూ కేంద్రాన్ని నిలదీశాడు. అయితే, కేంద్రం మాటమార్చి ప్యాకేజీ ఇవ్వడం దానికి చంద్రబాబు తలాడించడం జరిగిపోయాయి. అంతేకాదు, ఈ ప్యాకేజీకి రేపో మాపో చట్టబద్ధత కూడా వచ్చేయనుంది. మరోపక్క, తమిళనాడు జల్లికట్టు ఉదంతంతో ఏపీ యువత హోదాపై కదం తొక్కేందుకు సిద్ధమైన సమయంలో పవన్ వారికి మద్దతుగా నిలిచి అందరినీ ఆశ్చర్య పరిచాడు.
ఇక, ఇప్పుడు టీడీపీ, బీజేపీలు ప్యాకేజీయే మేలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో, విపక్షాలు కోరుతున్నట్టు హోదాయే మిన్న అని ఉద్యమాలు జరుగుతున్న సమయంలో అసలు ఈ రెండింటిలో మెజారిటీ ప్రజలు ఏం కోరుతున్నారు? వారు ఎలాంటి రాష్ట్రం కావాలని కోరుతున్నారు? అనే అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హోదా కావాలా? వస్తే.. ఏం జరుగుతుంది? అలాకాకుండా ప్యాకేజీయే కావాలా? దీంతో ఏం జరుగుతుంది? వంటి పలు కీలక అంశాలపై పవన్ సీక్రెట్ సర్వే చేయిస్తున్నాడట.
ఈ సర్వే ఆధారంగా పవన్ తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. అదేసమయంలో ఏపీలో నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా ప్రజల నుంచే వినేందుకు తనంతట తానుగా రాష్ట్రంలో పాదయాత్ర చేస్తాడని తెలిసింది. దీనిద్వారా జనసేనను ప్రజల్లోకి బలంగా చేర్చడం, అదేసమయంలో ప్రజల సమస్యలను తాను ప్రత్యక్షంగా తెలుసుకోవడం వంటివి జరిగిపోతాయి. ఈ నేపథ్యలోనే ఆయన సీక్రెట్ సర్వే చేయిస్తున్నట్టు తెలుస్తోంది. మరి సర్వే రిజల్ట్ ఎలా ఉంటుందో? పవన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.