బాబుకు షాక్‌:ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న సెగ‌లు రేప‌డం ఖాయం

ఏపీలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ సాక్షిగా అధికార టీడీపీలో పెద్ద లుక‌లుక‌లు స్టార్ట్ అయ్యేలా క‌నిపిస్తున్నాయి. పైకి మాత్రం వాతావ‌ర‌ణం అంతా స‌వ్యంగానే ఉన్న‌ట్టు క‌నిపిస్తోన్నా లోప‌ల మాత్రం అసంతృప్తి గాలి బుడ‌గ‌లా ఉంద‌ని…అది ఎప్పుడైనా ఢాంన పేల‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. మంత్రివ‌ర్గంలో భారీ స్థాయిలో ప్ర‌క్షాళ‌న జ‌ర‌గ‌నుంది. 7 గురు మంత్రుల‌ను త‌పించే బాబు కొత్త‌గా 13 మందిని కేబినెట్‌లోకి తీసుకుంటార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇదే క్ర‌మంలో పార్టీలో సామాజిక‌వ‌ర్గాలు – ప్రాంతాలు – సీనియారిటీని ఆయ‌న లెక్క‌లోకి తీసుకోనున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన ఫిరాయింపుదారుల‌కు మాత్రం మంత్రి ప‌ద‌వులు ఇచ్చేది లేద‌ని బాబు ఇప్ప‌టికే వాళ్ల‌కు సూచాయ‌గా చెప్పేశార‌ట‌. ఇదే ఇప్పుడు జంపింగ్ ఎమ్మెల్యేల్లో పెద్ద కాక రేపుతోంద‌ట‌. జంపింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మంది మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్నా అంద‌రికంటే క‌ర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వీరిలో ముందు ఉన్నారు.

భూమాకు ఎట్టి పిరిస్థితుల్లోను మంత్రి ప‌ద‌వి గ్యారెంటీ అని టీడీపీ వ‌ర్గాలే భావించాయి. ఇక మీడియాలో జ‌రిగిన ప్ర‌చారానికి లెక్కేలేదు. అయితే అదే క‌ర్నూలు జిల్లాకు చెందిన శిల్పా, గంగుల సోద‌రులు మాత్రం భూమాకు మంత్రి ప‌ద‌వి ఇచ్చే విష‌యంలో తీవ్రంగా విబేధించారు. వీరిలో గంగుల సోద‌రులు ఇప్ప‌టికే వైసీపీలోకి జంప్ చేసేయ‌గా…శిల్పా సోద‌రులు కూడా అదే బాట‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఇక త‌న‌తో పాటు త‌న కుమార్తె సొంత బంధువు అయిన జ‌గ‌న్‌ను వ‌దులుకుని వ‌చ్చామ‌ని…మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతే టీడీపీలో ఉండే ప్ర‌శ‌క్తే లేద‌ని ఇప్ప‌టికే ఫ్రీల‌ర్లు వ‌దిలార‌ట‌. భూమాకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌ని ప‌క్షంలో భూమాతో పాటు ఆయ‌న కుమార్తె అఖిల‌ప్రియ సైతం తిరిగి వైసీపీలోకి రివ‌ర్స్ జంప్ చేసేస్తార‌ని టాక్ వ‌స్తోంది.

అదే జ‌రిగితే ఇక్క‌డ మంత్రి ప‌ద‌వి కోసం వెయిట్ చేస్తోన్న జంపింగ్ జ‌పాంగ్‌లు జ‌లీల్‌ఖాన్‌, జ్యోతుల నెహ్రూ, గొట్టిపాటి ర‌వికుమార్, సుజ‌య‌కృష్ణ రంగారావుతో పాటు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు రివ‌ర్స్ జంపింగ్ చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌న్న చ‌ర్చ‌లు ఏపీ పొలిటిక‌ల్ ఇన్న‌ర్ కారిడార్‌లో న‌డుస్తున్నాయి. ఏదేమైనా ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న సెగ‌లు రేప‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.