కలలు కల్లలయ్యాయి. ఇక ఎక్కి కూర్చోవడమే లేటు అనుకున్న సీఎం సీటు పదేళ్లపాటు దూరం జరిగిపోయింది! ఈ పరిణామం ఊహించనైనా ఊహించలేదు దివంగత తమిళనాడు సీఎం జయలలిత నెచ్చెలి శశికళ. అక్రమార్జన కేసులో సుప్రీం తీర్పుకి ఆమె హతాశురాలైంది. అంతేకాదు, ఆమెకు సుప్రీం నుంచి ఊరట కూడా లభించలేదు. నెల రోజుల పాటు విరామం ప్రకటించాలన్న ఆమె అభ్యర్థనకు కూడా సుప్రీం అంగీకరించలేదు. దీంతో చివరాఖరికి కోర్టులో లొంగిపోవాల్సి వచ్చింది.
ఈ పరిణామంతో ఒక్కసారిగా ఆవేదన, ఆక్రోశానికి గురైన శశికళ.. తన పరివారం ఇళవరసి, సుధాకరన్లతో కలిసి బెంగళూరు కోర్టులో లొంగిపోవడానికి బయల్దేరింది. మధ్య అమ్మ సమాధిని దర్శించుకునేందుకు వెళ్లిన ఆమె అక్కడ ప్రవర్తించిన తీరు ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది. అమ్మ సమాధిపై మూడు సార్లు కొడుతూ.. తీవ్ర స్వరంతో శశి.. ఏదో ప్రతిజ్ఞ చేసింది. గతంలో ఎన్నడూ ఇలా ప్రవర్తించలేదు. మొన్నామధ్య గవర్నర్ను కలిసేందుకు వెళ్తూ కూడా ఆమె అమ్మ సమాధిని దర్శించుకుంది. ఈ సందర్భంగా మోకాళ్లపై కూర్చుని అమ్మకు మొక్కకుంది.
కానీ, ఇప్పుడు మాత్రం ఆమె వింతగా ప్రవర్తించడం అందరికీ ఆసక్తిగా మారింది. ఆమె మూడు సార్లు సమాధిపై చరచడాన్ని బట్టి.. మూడు ప్రతిజ్ఞలు చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకటి.. ఎట్టి పరిస్థితిలోనూ పార్టీకి ద్రోహం చేసిన పన్నీర్ను సీఎం కానివ్వబోనని, రెండు.. అమ్మ ఆశయాలు నిలబెట్టేలా రాష్ట్రంలో అన్నాడీఎంకేని ముందుకు వెళ్తానని, మూడు.. ఇలాంటి ప్రతి బంధకాలు చవి చూడడం మనకు(జయ, శశికళ) కొత్త కాదు.. వీటి నుంచి త్వరలోనే బయటపడి.. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తానని(అంటే మూడున్నరేళ్లలో శశికళ జైలు శిక్ష తీరిపోతుంది. అప్పటికి తమిళనాడు ఎన్నికలకు సిద్ధమవుతుంది) ప్రతిజ్ఞ చేసి ఉంటుందని అంటున్నారు. మరి నిజానిజాలు మాత్రం వెల్లడి కాలేదు.