మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తున్న తరుణంలో మరోసారి కేబినెట్ విస్తరిస్తారో లేదో తెలీదు గాని.. ఈసారి మాత్రం చాలా మంది `మంత్రి` ఆశలు పెట్టేసుకున్నారు. `ఇదే ఎన్నికల టీం` అని సీఎం చంద్రబాబు కూడా ప్రకటించేశారు. గతంలో మంత్రి ఆశించి తీవ్రంగా భంగపడిన వారిలో ఎమ్మెల్యే అనిత కూడా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎపిసో డ్తో ఒక్కసారిగా తెరపైకి వచ్చిన ఆమె.. మంత్రి పదవిపైనే చాలా ఆశలు పెట్టేసుకున్నారు. అయితే సమీకరణాల నేపథ్యంలో ఆమెకు దక్కలేదు. అయినా ఆమెకు మాత్రం మంత్రి ఆశ అలానే ఉండిపోయిందట. అంతేగాక మరో శాఖ కూడా డిసైడ్ అయిపోయారట. తనకు విద్యాశాఖ ఇస్తే దక్కుతుందని సన్నిహితులతో చెబుతున్నారట.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో రోజా వర్సెస్ అనిత అదో పెద్ద దుమారమే రేపింది. ఈ అంశంపై పెద్ద రచ్చే జరిగింది. ‘నాపై వ్యక్తిగత నిందారోపణలు చేశారు..’ అంటూ అప్పట్లో అనిత, కంటతడిపెట్టడం అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే రోజాపై సస్పెన్షన్ వేటు వ్యవహారమూ తెరపైకొచ్చింది. ఈ వ్యవహారంతోనే అనితకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. అప్పటివరకూ ప్రభుత్వం, చంద్రబాబుపై వ్యక్తిగతంగా ఎదురుదాడి చేయడంలో రోజా ముందుండేవారు. అయితే అనిత వ్యవహారంలో మాత్రం ఆమె కొంత డిఫెన్స్లో పడిపోయారు. ‘ముల్లుని ముల్లుతోనే తియ్యాలి` అన్న చందంగా రోజాపైకి ‘మహిళా కోటాలో అనితను ప్రయోగించారు.
అందులో సక్సెస్ అయిపోయారు చంద్రబాబు. అప్పటినుంచి అనిత పేరు మారుమోగిపోయింది. చంద్రబాబు డైరెక్షన్లో అత్యుత్సాహం చూపినప్పటికీ, అధినేత మెప్పు పొందినప్పటికీ, మంత్రి పదవి మాత్రం అనితను వరించలేదు. అయినాసరే, ఆమె తనకు మంత్రి పదవి దక్కుతుందనే గట్టి పట్టుదలతో ఉన్నారట. ‘విద్యాశాఖ’ మంత్రిగా తనకు అవకాశం దక్కబోతోందని గతంలో సన్నిహితుల వద్ద చెప్పుకున్నారట కూడా. ఆ పదవి నాకు దక్కితే చాలా చాలా చేయాలని ఉంది అంటూ తాజాగా విద్యా శాఖపై తన మమకారాన్ని చాటుకున్నారు అనిత.
ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా విశాఖకు చెందిన గంటా శ్రీనివాసరావు ఉన్నారు. అయితే ఇప్పుడు అనిత ఆయన పదవికి ఎర్త్ పెట్టేలా మాట్లాడటం రాజకీయంగా ఆశ్చర్యం కలిగించకమానదు. ఇప్పటికే గంటాపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయనపై చంద్రబాబు కూడా గుర్రుగా ఉన్నారు. మరి ఈ సమయంలో అనిత వ్యాఖ్యలు ఆయన పరిగణనలోకి తీసుకుంటారో లేదో వేచిచూడాలి. మరి రెండేళ్లలో ఏమైనా జరగవచ్చు కదా!!