అరకు ఎంపీ కొత్తపల్లి గీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్టీ కాదంటూ టీడీపీ నేత గుమ్మడి సంధ్యారాణి హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే! ఆ సమయంలో ఆమె చిక్కుల్లో పడ్డారు. అయితే ఆమె టీడీపీకి సానుకూలంగా వ్యవహరిస్తుండటంతో వెంటనే సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి.. సమస్యను పరిష్కరించారు. సంధ్యారాణి వేసిన పిటిషన్ వెనక్కుతీసుకున్నారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆమె టీడీపీ అధినేతకు షాక్ ఇచ్చారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆమె.. యూ టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. టీడీపీ, సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అంతేగాక టీడీపీతో తనకు సంబంధం లేదంటూ.. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
టీడీపీతో తనకు ఎలాంటి సంబంధం లేదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత స్పష్టంచేశారు. వైసీపీ టిక్కెట్ పై గెలిచిన కొత్త పల్లి గీత తర్వాత టీడీపీలోకి జంప్ అయ్యారు. పార్టీ కండువా కప్పుకోకపోయినా టీడీపీ వెంటే ఆమె నడిచారు. అయితే సడెన్ గా మళ్లీ ఆమె టోన్ మార్చారు. తనకు టీడీపీతో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పై కూడా గీత ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యలుచేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రివిలేజ్ కమిటీ ముందు పెడతానని తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశానికి హాజరుకాబోనని ఆమె స్పష్టం చేశారు.
ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు గిరిజన సలహామండలిని ఏర్పాటు చేశారు. అందులో అరకు ఎంపీ గీతకు స్థానం కల్పించలేదు. మొత్తం 20 మందితో సలహా మండలిని ఏర్పాటు చేస్తే అందులో తనకు చోటు లేకపోవడంపై గీత మండిపడుతున్నారు. అంతేకాకుండా తనకు పార్టీ అధినేత పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూడా గీత చెబుతున్నారు. గీత ఇప్పటి వరకూ కొంత సంయమనమే పాటించారు. హైకోర్టులో గీత ఎస్టీ కాదంటూ వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉండటమే ఇందుకు కారణం. గీత ఎస్టీ కాదని ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ నేత గుమ్మడి సంధ్యారాణి హైకోర్టులో పిటీషన్ వేశారు. సీఎంజోక్యంతో సంధ్యారాణి పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.
దీంతో ఇక గీత.. టీడీపీపై మండిపడుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వైసీపీ నుంచి ఎన్నికై.. టీడీపీలోకి వచ్చి మళ్లీ ఆ పార్టీపై ధ్వజమెత్తుతున్న గీత స్టేటజీ ఏంటో అర్ధం కాక నేతలు షాక్లో ఉన్నారు. మొత్తానికి తనపై ఉన్న కేసును సీఎం చంద్రబాబుతో మాఫీ చేయించుకుని.. ఇప్పుడు ఆయనకే పెద్ద షాక్ ఇవ్వడం గీతకే చెల్లిందేమో!!