ఇటీవల కాలంలో కేంద్రంలోని బీజేపీపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు గళం విప్పుతున్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయలేకపోతోంది_ అంటూ కామెంట్లు కుమ్మరిస్తున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ రేంజ్లో బాబు రెచ్చిపోయిన సందర్భాలు పెద్దగాలేవు. నిజానికి ప్రత్యేక హోదా విషయంలోనే బాబు కేంద్రంతో గొడవ పెట్టుకుంటారని అనుకన్నారు. అయితే, అనూహ్యంగా ఆయన ప్యాకేజీ ఇచ్చినా సర్దుకు పోయారు. అదేసమయంలో పోలవరం విషయంలోనూ కేంద్రం నిదులు సక్రమంగా ఇవ్వలేకపోతున్నా బాబు నిన్నమొన్నటి వరకు పెద్దగా విమర్శించి లేదు.
అయితే, అనూహ్యంగా ఆయన ఇటీవల కాలంలో బీజేపీకి నొప్పి తెలియకుండా వాత పెడుతున్నారు. ప్యాకేజీ ప్రకటించారు కానీ, నిధులు మాత్రం ఇవ్వడం లేదని, పోలవరాన్ని 2018 నాటికి పూర్తి చేయాలని గట్టి నిర్ణయంతో ఉన్నామని అయితే, దీనిని కూడా పట్టించుకోవడం లేదని, లోటు బడ్జెట్ విషయంలో కేంద్రం డింకీలు కొడుతోందని బాబు ఇటీవల మీడియాతో చెప్పుకొచ్చారు. కేంద్రం సకాలంలో నిధులు ఇవ్వకపోతే అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం మరింత శ్రమించాల్సి వస్తుందన్నారు. రైల్వే జోన్ విషయమై కేంద్రం తేల్చాల్సి ఉందని గుర్తు చేశారు. రెవెన్యూ లోటు బర్తీ అంశాన్ని కూడా చంద్రబాబు మాట్లాడారు.
అయితే, ఇలా బాబు వైఖరి మారిపోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు విశ్లేషకులు. 2014లో బీజేపీతో పొత్తు అనివార్యమైంది. అయితే, ఇప్పుడు బాబు బలం పుంజుకుంది. అదేసమయంలో బలంగా ఉంటాడని, ఉన్నాడని భావించిన ప్రధాన విపక్షం, వైసీపీ వైఖరి మరింత దారుణంగా తయారైంది. నంద్యాల, కాకినాడ ఎన్నికలు బాబుకు ఏకపక్ష విజయాన్ని అందించాయి. ఈ క్రమంలో అవసరమైతే.. 2019లో ఒంటరిగా వెళ్లాలని బాబుడిసైడ్ అయ్యారు.
ఈ క్రమంలో ఒక వేళ అప్పటికి కూడా రాష్ట్రంలో అనుకున్న ప్రాజెక్టులు పట్టాలెక్కకపోతే.. తప్పు తనది కాదని, బీజేదేనని చెప్పాలి. అయితే, అప్పటికప్పుడు బీజేపీని దోషిని చేస్తే.. జనాలు నమ్మరు కాబట్టి.. బాబు ఇప్పటి నుంచి ఇలా ప్లే చేస్తున్నారని సమాచారం. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. తనతో పొత్తు కావాలని బీజేపీ అనుకుంటే.. తనమాటకు విలువ ఇస్తుందని బాబుభావిస్తున్నారు. సో.. మొత్తంగా బీజేపీని ఇటీవల కాలంలో బాబు బాగానే కంట్రోల్ చేస్తున్నారన్నమాట!