టిక్కెట్లుతో పాటు ఎన్నికల ఖర్చు కూడా తామే భరిస్తాం

బుల్లి తెర నుంచి సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి అటు నుంచి రాజ‌కీయ‌ల్లోకి వ‌చ్చిన వారిని మ‌నం చూశాం… చూస్తున్నాం.. అయితే, తాజాగా తెలంగాణ‌లో మాత్రం బుల్లి తెర నుంచే నేరుగా పోలిటిక‌ల్ ఆఫ‌ర్ సంపాయించేసిన యాంక‌ర్ల‌ను చూస్తే.. వారి ల‌క్కే ల‌క్క‌ని ముక్కున వేలేసుకోకుండా ఎవ‌రూ ఉండ‌లేరు. మ‌రి విష‌యం ఏంటో చూద్దాం.. తెలంగాణలో బిత్తిరి సత్తి.. సావిత్రిలు మంచి పాపుల‌ర్ ఫిగ‌ర్స్‌. వీ6 ఛానల్ లో వచ్చే తీన్మార్ వార్తలతో వీరిద్దరూ పాపులర్ అయ్యారు. ఇక సత్తి అయితే ఏకంగా సినిమాల్లో కూడా ఛాన్స్ లు కొట్టేస్తున్నాడు.

వీ6 ఛానల్ లో ఫుల్‌ రేటింగ్ ఉండే కార్యక్రమం కూడా వీరిద్దరిదే. దీంతో వీరిద్ద‌రిపైనా బీజేపీ క‌న్ను ప‌డింద‌ట‌! ఇక్క‌డ భారీ ఎత్తున పాగా వేసి.. 2019లో కేసీఆర్‌కు దీటుగా అధికారం చేజిక్కించుకోవాల‌ని క‌మ‌ల నాధులు భావిస్తున్నారు. దీంతో బిత్తిరి సత్తితోపాటు సావిత్రి ని వచ్చే ఎన్నికల్లో పోటీకి దింపాలని బీజేపీ చూస్తోంది. టిక్కెట్లు ఇవ్వటంతో పాటు ఎన్నికల ఖర్చు కూడా తామే భరిస్తామని క‌మ‌ల నాధులు వీరిద్దరికీ ఆఫర్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సావిత్రికి ఎంపీ సీటు…సత్తికి ఎమ్మెల్యే సీటు ప్రతిపాదించినట్లు సమాచారం.

అయితే కెరీర్ పరంగా ఎంతో పీక్ లో ఉన్న తాము రాజకీయాల్లోకి రావాలా? వద్దా అనే విషయంలో ఈ ఇద్ద‌రూ ప్రస్తుతం సంశయంలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ‌లో పాగా వేయటానికి భారీ ఎత్తున కసరత్తు చేస్తున్న షా ఇప్పటికే పాపులర్ వ్యక్తులతో పాటు వివిధ రంగాల్లో మంచి గుర్తింపు ఉన్న వారిని అన్వేషించే పనిలో పడ్డారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన ఆయ‌న స్థానిక నాయకత్వానికి పలు అంశాలపై దిశా, నిర్దేశం చేశారు. అందులో భాగంగానే ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపిక పనిలో పడినట్లు కన్పిస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఇప్ప‌టికైతే.. ఇది న్యూ ట్రెండే అవుతుంది!!