ప్రకాశం జిల్లాలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాం మధ్య కొద్ది రోజులుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బల్లికురవ మండలం వేమవరంలో కరణం వర్గానికి చెందిన ఇద్దరు కార్యకర్తలు దారుణ హత్యకు గురవ్వడంతో వీరిద్దరి మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంది. గొట్టిపాటి వర్గీయులు జరిపిన దాడిలోనే తమ వర్గీయులు హత్యకు గురయ్యారని కరణం బలరాం మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే మంగళవారం ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడి ఎంపిక సందర్బంగా గొట్టిపాటి వర్సెస్ కరణం వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ ఘర్షణలో ఇరువర్గాలు ఒకరినొకరు తోసుకోవడంతో పాటు చొక్కాలు కూడా చించుకున్నారు. ఈ గొడవలో గొట్టిపాటి రవికుమార్ కింద పడిపోయారు. పోలీసులు ఎంతో కష్టంతో జోక్యం చేసుకుని గొట్టిపాటిని అక్కడ నుంచి పంపించారు. చివరకు మంత్రులు నారాయణ, సిద్ధా రాఘవరావు, పరిటాల సునీత సైతం బలరాంను శాంతింపజేయలేకపోయారు.
ఇదిలా ఉంటే ఈ ఘర్షణ విషయమై, తనపై జరిగిన దాడిని చంద్రబాబును కలిసి చెప్పాలనుకున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి చంద్రబాబు ఊహించని షాక్ ఇచ్చారు. మంగళవారం గొడవ జరిగిన వెంటనే రవి చంద్రబాబు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆయన బాబును కలుస్తారని మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. అయితే మధ్యాహ్నం తర్వాత చంద్రబాబు ఆయనకు షాక్ ఇచ్చారు. తాను బిజీగా ఉన్నానని ఇప్పుడు కలవడం కుదరదని సీఎం కార్యాలయ అధికారులు చెప్పడంతో గొట్టిపాటి నిరాశకు గురయ్యారు.
ఇక బాబు ఈ రోజు తెలంగాణ మహానాడుకు వెళుతున్నారు. కనీసం అక్కడ అయినా చంద్రబాబును కలిసి తన తప్పులేదని చెప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా కరణం వర్సెస్ గొట్టిపాటి పోరులో చంద్రబాబు ఇద్దరిపైనా సీరియస్గా ఉన్నట్టు కనిపిస్తోంది. ముందుగా ఈ విషయంలో ఆయన బలరాంపైనే ఆగ్రహంగా ఉన్నారని అనుకున్నా…ఇప్పుడు గొట్టిపాటికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో ఆయనపై కూడా సీరియస్గానే ఉన్నట్టు తెలుస్తోంది.