తలపండిన రాజకీయ నేతలకు పాఠాలు చెప్పగల సామర్థ్యం ఉన్న నేత టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు. ఎప్పటికప్పుడు పార్టీని, ప్రజలను సమన్వయం చేస్తూ.. తోక ఝాడిస్తున్న నేతలకు షాక్ ఇస్తూ.. దూసుకు పోవడం ఆయన సాధ్యం అయ్యేనా? వ్యక్తిగత క్రమశిక్షణకు పెద్ద పీట వేసే బాబు.. తనలాగానే పార్టీ నేతలు కూడా క్రమశిక్షణతో మెలగాలని కోరుకుంటారు. అయితే, ఈ విషయంలోనే టీడీపీ నేతలకు బాబు మింగుడు పడడంలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో ఏపీలో వచ్చే మరో 30 ఏళ్లు అధికారంలో ఉండాలని బాబు డిసైడ్ అయ్యారు. దీనికిగాను పూర్తి కార్యాచరణతో కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి, వారిలో గెలుపు గుర్రాలు ఎన్ని? వంటి లెక్కలు తీస్తున్నారు. మరోపక్క, పార్టీని, పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ఆయన నంద్యాల ఉప ఎన్నిక ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు మరింత దగ్గర అవడం కోసం.. ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని నేతలకు ముందుగానే హెచ్చరించారు. దీనికి అందరూ తలలు ఆడించారు. ఇక, ఈ ప్రోగ్రాం ప్రారంభమై.. 20 రోజులు గడిచింది. ఇక, ఇప్పుడు దీని పరిస్థితిపై బాబు సమీక్ష నిర్వహిస్తున్నారు.
ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నారా లేదా? వారికి అందుబాటులో ఉంటున్నారా, ఎవరెవరు బాగా పని చేస్తున్నారు అనే వివరాలను సర్వే ద్వారా తెలుసుకుంటున్నారని సమాచారం. కార్యక్రమానికే ముందే పనితీరు సరిగ్గాలేని ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలను సీఎం సున్నితంగా మందలించినట్లు తెలిసింది. ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడం కష్టమని, ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. దీంతో ముఖ్యమంత్రి వద్ద మార్కులు కొట్టే సేందుకు వారు చెమటోడుస్తున్నారు.
ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరిస్తున్నారు. సీఎం సూచనలను దృష్టిలో పెట్టుకుని నేతలు ఇప్పటినుంచే జాగ్రత్తపడుతున్నారు. లేకుంటే టిక్కెట్ గల్లంతవుతుందనే బెంగ వారిని పట్టుకుంది. దీంతో నేతలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నట్టు సమాచారం. అయినా కూడా బాబు ఎక్కడ సర్వే చేయిస్తారో? తమ వైఫల్యం ఎక్కడ బయటపడుతుందోనని వారు తెగ ఫీలవుతున్నారు. మొత్తానికి బాబు పెట్టిన సర్వే నిఘా బాగానే వర్కవుట్ అవుతోంది.