ఏపీలో రాజకీయం రంజుగా మారుతోంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వైసీపీ నుంచి టీడీపీలోకి జంపింగ్లు జోరందుకుంటున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలోని చీరాల, చిత్తూరు జిల్లాలోని పలమనేరుకు చెందిన పలువురు నేతలు వైసీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఇదిలా ఉంటే మాజీ ఎంపీ చిమటా సాంబు కూడా వైసీపీలో చేరిపోయారు. ప్రకాశం జిల్లా చీరాల వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎడం బాలాజీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ చిమటా సాంబుతోపాటు పలువురు కీలక నాయకులు వైసీపీలో చేరారు.
వైసీపీలో చేరిన వారిలో గడ్డం శ్రీనివాసరావు(పీడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్), కర్ణ శ్రీనివాసరావు(వేటపాలెం మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు), వేటగిరి సంజీవరావు(ప్రకాశం జిల్లా యానాది సంఘం అధ్యక్షుడు), బొచ్చుల మోహన్రావు(పుల్లాయపాలెం మాజీ సర్పంచ్) తదితరులు ఉన్నారు.
మంత్రి అమర్నాథ్రెడ్డికి షాక్….
తాజా జంపింగ్ల పర్వంలో మంత్రి అమర్నాథ్రెడ్డికి అదిరిపోయే షాక్ తగిలింది. పలమనేరు ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి వైసీపీ గుర్తు మీద గెలిచి టీడీపీలోకి మారి మంత్రి అయిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ప్రధాన అనుచరుడిగా ఉన్న ఆకుల గజేంద్ర అమర్ నాథ్కు షాక్ ఇస్తూ వైసీపీలోకి వచ్చేశారు. తాను ఊపిరి ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటానని జగన్కు మాట ఇచ్చారు. ఇది అమర్నాథ్రెడ్డికి పెద్ద షాకే అన్న టాక్ చిత్తూరు జిల్లాలో నడుస్తోంది.