కొందరి వ్యూహాలు మరికొందరికి శాపంగా పరిణమిస్తుంటాయి. అయినా ఏం చేస్తారు? టైం బ్యాడ్ అనుకుని సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ చైతన్యం ఉన్న నల్లగొండ జిల్లా కు చెందిన కాంగ్రెస్ మాజీ నేత, ప్రస్తుతం టీఆర్ ఎస్ ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి పరిస్థితి కూడా ఇలానే ఉందట. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు తట్టిన వ్యూహానికి గుత్తా బలైపోతున్నారట. ఇప్పుడు ఈ విషయంలో స్టేట్ పాలిటిక్స్లో హాట్ టాపిక్ అయింది. విషయంలోకి వెళ్తే.. రాష్ట్రంలో రాజకీయంగా ఓ స్తబ్దత నెలకొంది.
అధికార పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని విపక్షాలు అంటున్నాయి. అదేసమయంలో విపక్షాలకు ప్రజల ఆదరణ ఎంతమాత్రమూ లేదని అధికార పక్షం ఆరోపిస్తున్నాయి. మరోపక్క 2019 ఎన్నికలు దూసుకుని వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్కు ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది. ఎన్నికలు వచ్చేందుకు ఏడాదిన్నరకు పైగా సమయం ఉందికాబట్టి.. ఇప్పుడు ఎక్కడో ఒక చోట .. ఉప ఎన్నిక నిర్వహించి అధికార పార్టీ బలాన్ని నిరూపించుకుంటే పోలా! అని ఆయన భావిస్తున్నారట. దీంతో వెంటనే ఆయనకు నల్లగొండ జిల్లా, గుత్తా సుఖేందర్ రెడ్డి మైండ్లోకి వచ్చేశారట.
వాస్తవానికి నల్లగొండ జిల్లా కాంగ్రెస్కు కంచుకోట. ప్రస్తుతం టీఆర్ ఎస్లో ఉన్న గుత్తా 2014లో కాంగ్రెస్ తరఫున నల్లగొండ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత టీఆర్ ఎస్లోకి చేరిపోయారు. అలాంటి కాంగ్రెస్కు పట్టున్న జిల్లా అయితే, టీఆర్ ఎస్ బలం మరింతగా బయట పడుతుందని అనుకున్నారట కేసీఆర్. అదీకాక, ఇప్పటికే జీహెచ్ ఎంసీ సహా రెండు చోట్ల జరిగిన ఎన్నికల్లో టీఆర్ ఎస్ అంటే ఏమిటో తెలిసింది కాబట్టి. ఇప్పుడు విపక్షం కాంగ్రెస్కు పట్టున్న చోట గెలిస్తే.. ఇటు విపక్షాలకు బుద్ధి చెప్పడంతోపాటు, అటు టీఆర్ ఎస్ శ్రేణుల్లో జోష్ నింపినట్టు ఉంటుందని గులాబీ బాస్ స్కెచ్ సిద్ధం చేశారు.
ఈ క్రమంలోనే గుత్తాతో ఎంపీ పదవికి రాజీనామా చేయించి మరో బలమైన నేతను అక్కడి నిలబెట్టి ఉప ఎన్నికలో గెలుపు సాధించాలని సీఎం ప్లాన్ చేస్తున్నారు. దీంతో గుత్తాను బుజ్జగించేందుకు, ఆయన హోదాకు, గౌరవానికి భంగం కలగకుండా ఉండేందుకు రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్గా ఆయనను నియమించాలని కేసీఆర్ అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్లాన్ పట్టాలెక్కితే.. మిగిలిన పక్షాల పరిస్థితి ఏంటో చూడాలి.