2019 ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తానని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించడంతో ఇప్పుడు ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారనే విషయంపై సందిగ్ధం నెలకొంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి అనంతపురంలో సినీ, రాజకీయ ప్రముఖులు పోటీలో ఉండటంతో అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్పై పోటీచేసే అభ్యర్థి విషయంలో టీడీపీ నేతలు, ముఖ్యంగా ఏళ్లుగా రాజకీయాలను శాసిస్తున్న జేసీ వర్గం ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్కడి సామాజికవర్గ ఓట్లను తమ వైపు తిప్పుకుని పవన్ను టార్గెట్ చేసేందుకు అధ్యక్షుడు చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం!
దశాబ్దాల కాలం నుంచి రాయలసీమ అనంతపురం రాజకీయాలను జేసీ బ్రదర్స్ శాసిస్తున్నారు. కాగా వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లో రిటైర్ మెంట్ తీసుకోవాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి వైదొలగకపోయినా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని జేసీ దివాకర్ రెడ్డి భావిస్తున్నట్లు అనంతపురం రాజకీయాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తన వారసుడు పవన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఇప్పటికే జేసీ భావిస్తున్నారు. ఇప్పటికే అందుకు తగిన వ్యూహాన్ని కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అందుకోసం ఆయన తన వ్యూహాలకు పదును పెట్టారని అంటున్నారు.
మరో వైపు దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి కూడా తన కుమ్మాడు అస్మిత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో పోటీలోకి దింపాలని భావిస్తున్నట్లు జేసీ సోదరుల అనుచరుల చెబుతున్నారు. అయితే ఈనేపథ్యంలో పవన్ అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేసే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పవన్ను నిలువరించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పక్కా వ్యూహాన్ని అమలుచేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పవన్పై టీడీపీ అభ్యర్థిగా జేసీ కుమారుడు పవన్ రెడ్డిని బరిలోకి దించేలా బాబు వ్యూహం పన్నుతున్నారట. అక్కడ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి కార్పొరేషన్ పదవి ఇచ్చి, ఆ సీటు పవన్రెడ్డికి సీటు ఇస్తారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
దీనివెనుక కూడా భారీ వ్యూహమే ఉందట. జేసీ తనయుడు అక్కడ పోటీచేస్తే నియోజకవర్గంలోని కమ్మ+రెడ్డి ఓట్లు టీడీపీకి పడతాయని చంద్రబాబు భావిస్తున్నారట. ఇది టీడీపీకి లాభిస్తుందని, అదే సమయంలో పవన్కు మైనస్గా మారుతుందని బాబు భావిస్తున్నారట. చంద్రబాబు ఇలా పవన్ను టార్గెట్ చేసేందుకు వ్యూహం పన్నుతున్నట్టు తెలుస్తోంది.