కేసీఆర్‌పై ఇద్ద‌రు టీఆర్ఎస్ ఎంపీల‌కు కాక పుట్టిందా..!

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు వ‌న్ మ్యాన్ షో న‌డుస్తోంది. ఇటు ప్ర‌భుత్వంలోనే కాదు అటు పార్టీలో కూడా కేసీఆర్ చెప్పిందే ఫైన‌ల్ డెసిష‌న్‌. నిన్న‌టి వ‌ర‌కు అక్క‌డ మంచి ప్ర‌యారిటీ ఉన్న కేసీర్ మేన‌ళ్లుడు హ‌రీష్‌రావును కూడా వ్యూహాత్మ‌కంగా ప‌క్క‌న పెట్టే ప్ర‌క్రియ ప్రారంభ‌మైందంటున్నారు. ఇదిలా ఉంటే కేసీఆర్ తీరుపై  పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్లుగా ఉన్న ఇద్ద‌రు ఎంపీలు మండిప‌డుతున్నార‌ట‌. 

కే.కేశవరావు. ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరచితమే. కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన ఆయ‌న ఆ త‌ర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్‌లో చేరిన ఆ త‌ర్వాత ఆయ‌న రాజ్య‌స‌భ‌కు కూడా ఎంపిక‌య్యారు. అస‌లు ఇప్పుడు కెకె ఎక్క‌డ ఉన్నారో ?  కూడా ఎవ్వ‌రికి తెలియ‌ని ప‌రిస్థితి. కేకే లాంటి సీనియ‌ర్‌ను కేసీఆర్ వ్యూహాత్మ‌కంగానే ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది. మియాపూర్ భూ కుంభకోణం విషయంలో కేసీఆర్ తనను టార్గెట్ చేశారని కేకే భావిస్తున్నారు. అందుకే ఆయన గత కొన్ని నెలలుగా పార్టీ నేతలకు కూడా టచ్ లో ఉండటం లేదు. 

టీఆర్ఎస్‌లోని కొంద‌రు ముఖ్య నాయ‌కులు కూడా త‌న‌ను ఒంట‌రిని చేసే కుట్ర‌లో భాగ‌స్వాములు అయిన‌ట్టు కేకే అనుమానిస్తున్నారు. గ్రేట‌ర్ కార్పొరేష‌న్ టిక్కెట్ల ఎంపిక‌లో కేకే కాస్త ఎక్కువ‌గానే జోక్యం చేసుకున్నారు. కేకే కుమార్తె విజ‌య‌ల‌క్ష్మికి కూడా కార్పొరేట‌ర్ సీటు ద‌క్కింది. అప్ప‌టి నుంచి కేసీఆర్ కేకేను ప‌క్క‌న పెడుతూ రావ‌డంతో పాటు మియాపూర్ భూ కుంభ‌కోణం త‌ర్వాత పూర్తిగా ప‌క్క‌న పెట్టేసిన‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇక పార్టీలోని మ‌రో సీనియ‌ర్‌, కాంగ్రెస్‌లో దిగ్గ‌జంగా ఉన్న డీ.శ్రీనివాస్ ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. డీఎస్‌ను పార్టీలోకి చేర్చుకునేట‌ప్పుడు కేసీఆర్ ఎంతో ప్ర‌యారిటీ ఇచ్చారు. ఆ త‌ర్వాత ఆయ‌న రాజ్య‌స‌భ‌కు కూడా ఎంపికయ్యారు. ఇప్పుడు డీఎస్ త‌న‌యులు ఇద్ద‌రూ ఆయ‌న మాట విన‌ని ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఓ కుమారుడు బీజేపీలోకి వెళ్లిపోయాడు. మ‌రో కుమారుడు కూడా ఎమ్మెల్యే టిక్కెట్ కోసం కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవ‌ల డీఎస్‌కు కేసీఆర్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌లేద‌ని అంటున్నారు. దీంతో డీఎస్ ఇక్క‌డ అవ‌మానాలు త‌ట్టుకోలేక తిరిగి కాంగ్రెస్‌లోకి వెళితే ఎలా ఉంటుంద‌ని ఆలోచ‌న చేస్తున్నార‌ట‌. ఏదేమైనా  ఈ ఇద్ద‌రు సీనియ‌ర్లు కేసీఆర్ మీద తీవ్రంగా ర‌గిలిపోతున్నార‌న్న‌దే వాస్త‌వం.