తెలంగాణ ఉద్యమ పోరులో తనకంటూ ఓ అధ్యాయాన్ని సొంతం చేసుకున్న ఉస్మానియా ప్రొఫెసర్ కోదండ రాం.. ఉద్యమ సమయంలో మేధావులను కదిలించిన తీరు నభూతో.. ! అయితే, నాటి ఉద్యమ నేతల్లో చాలా మంది కేసీఆర్ పంచన చేరి పదవుల్లో విలాస జీవితాలు గడుపుతుంటే.. కోదండరాం మాత్రం ప్రజల పక్షాన ఇంకా పోరాడుతూనే ఉండడం నిజంగా హర్షణీయం. ఇటీవల కాలంలో ఆయన ఊహించని విధంగా కేసీఆర్పై ఉద్యమ బావుటా ఎగరేశారు. మల్లన్నసాగర్ నిర్వసితులు, రైతులు, రీయింబర్స్మెంట్, సీఎం కొత్త నివాసం, కొత్త సచివాలయ నిర్మాణం వంటి వాటిపై కోదండ రాం గళమెత్తారు.
ఇక, ఇప్పుడు ఆయన తన ఉద్యమాన్ని మరింత విస్తృతం, ఉధృతం చేయనున్నారు. రాష్ట్రంలో తెలంగాణ(మా రాష్ట్రం మా పాలన) ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లయినా.. నిరుద్యోగులకు ఎక్కడా ఉపశమనం లభించకపోవడంపై కోదండ రాం గళం విప్పారు. అయితే, దానికి ఆయన ఎంచుకున్న పంథా ఇప్పుడు సంచలనంగా మారింది. సోషల్ మీడియా ద్వారా తన గళాన్ని వినిపిస్తానని ఆ మధ్యన చెప్పిన కోదండ రాం అందుకు తగ్గట్లే.. ఈ నెల 22న నిర్వహించనున్న‘నిరుద్యోగుల నిరసన ర్యాలీ’కి బోనాల జాతర మాదిరి తరలిరావాలంటూ పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో ఆయన బలమైన సోషల్ మీడియా వేదిక ఫేస్బుక్ను ఎంచుకున్నారు. తొలిసారి ఫేస్ బుక్ లైవ్ లో నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడు. ఇది అనూహ్య స్పందన తెచ్చిపెట్టింది. ఆయన వీడియోను 24 గంటల వ్యవధిలో 1.24లక్షల మంది చూడటమేకాదు.. ఇది ప్రసారమైన మూడు గంటల్లోనే 16వేల మంది చూడటం గమనార్హం.
అంతేకాదు.. ఫేస్ బుక్ లో 8700 మంది రియాక్ట్ కావటమే కాదు.. లైవ్ లో 4500 మంది కామెంట్లు చేశారు.నిరుద్యోగుల పక్షాన నిర్వహించే కోదండం మాష్టారి ర్యాలీకి తాము తప్పక మద్దతు ఇస్తామన్న కామెంట్లను పలువురు పోస్ట్ చేయటం ఇప్పుడు అధికార పక్ష నేతల్లో గుబులు రేపుతోంది. మొత్తానికి తెలంగాణలో కేసీఆర్ సర్కారుకి కోదండ రాం మొగుడయ్యారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.