లోకేష్ దగ్గర నేత‌ల ఫీట్లు స్టార్ట్‌!

2019 ఎన్నిక‌ల‌కు చాలా స‌మ‌యమే ఉంది. అయినా కూడా ఏపీలో అధికార, విప‌క్షాలు ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల వేడిలో మ‌గ్గిపోతున్నాయి. వివిధ కార్య‌క్ర‌మాల‌తో వైసీపీ త‌న అజెండా ప్ర‌క‌టించింది. మిస్ఢ్ కాల్‌, వైయ‌స్సార్ కుటుంబం, న‌వర‌త్నాలు వంటి ప‌థ‌కాల‌తో ముందుకు పోయేందుకు కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే మిస్డ్ కాల్ విష‌యంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం కూడా ప్రారంభించింది. అదే స‌మ‌యంలో అధికార ప‌క్షం టీడీపీ కూడా త‌న‌దైన శైలిలో దూసుకుపోతోంది. ఇంటింటికీ టీడీపీ- పేరుతో ఇప్ప‌టికే అధికార ప‌క్షం ఓ పెద్ద కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్పన చేసింది. నేత‌ల‌ను వీధివీధిలోనూ తిప్పుతోంది. ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు పంపుతోంది.

మొత్తానికి అప్పుడే ఎన్నిక‌ల వేడి పుట్టింది. ఇక‌, ఈ ఇంటింటికీ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్న బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్‌కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తోంది. ఆయ‌న‌కు వెళ్లిన ప్ర‌తి చోటా ఘ‌న స్వాగతం ల‌భిస్తోంది. టీడీపీ నేత‌లు, మ‌హిళా నేత‌ల నుంచి పెద్ద ఎత్తున ఆహ్వానాలు అందుతున్నాయి. దీనికిగా ప్ర‌ధాన కార‌ణం ఏంటా అని ప‌రిశీలిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌పై చిన‌బాబు ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌డ‌మేన‌ని తెలిసింది. అంటే, ఇప్ప‌టికే రాష్ట్రంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175 స్థానాలు, 75% పోలింగ్‌తో దూసుకుపోవాల‌ని లోకేష్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌పైనా ప‌ట్టు బిగిస్తున్నారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో నేత‌ల‌కు టికెట్లు ఇచ్చే బాధ్య‌త లోకేష్‌దేన‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

దీనిని గ‌మ‌నించిన టీడీపీ నేత‌లు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిస్తున్న నేత‌లు.. లోకేష్‌ను మ‌చ్చిక చేసుకోవ‌డం ప్రారంభించారు. లోకేష్ దృష్టిలో పడటానికి తాపత్రయపడుతున్నారు. ఇటీవల విజయనగరం జిల్లాలో పర్యటించిన లోకేష్ అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే లలిత కుమారికి టిక్కెట్ కూడా కన్ ఫర్మ్ చేశారు. ఎస్ కోట ఎమ్మెల్యే లలిత కుమారిని లోకేష్ బాబు తెగ మెచ్చుకున్నారు.

2019 ఎన్నికల్లోనూ లలిత కుమారిని తిరిగి గెలిపించాలని లోకేష్ ప్రజలను కోరడం విశేషం. దీంతో ఎమ్మెల్యే వర్గంలో ఆనందం పెల్లుబుకుతోంది. దీంతో మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా చినబాబును తమ నియోజకవర్గంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సో.. చిన‌బాబును మ‌చ్చిక చేసుకుని టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసుకునేందుకు నేత‌లు తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ల ఫీట్లే టీడీపీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారాయి.