ఈ ఒక్క నియోజ‌క‌వ‌ర్గం కోస‌మే..బాబు మ‌దిలో మూడు ఆప్ష‌న్లు..!

లోకేష్ త‌న రాజ‌కీయ వార‌సుడిగా ప్ర‌మోట్ చేసేందుకు చంద్ర‌బాబు చ‌క్క‌టి ప్లానింగ్‌తో వెళుతున్నారు. లోకేష్‌ను మంత్రిని చేసేందుకు ఎమ్మెల్సీ చేసి ఆ వెంట‌నే కేబినెట్‌లోకి తీసేసుకున్నారు. అన్ని చ‌క్క‌గా సెట్ అయ్యాయి. ఇక లోకేష్ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో నిల‌బ‌డి ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయ‌న‌పై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌కు కూడా ఫుల్ స్టాప్ ప‌డిపోతుంది. ఈ ఒక్క నియోజ‌క‌వ‌ర్గం కోస‌మే చంద్ర‌బాబు నానా తంటాలు ప‌డుతున్నారు.

లోకేష్ కోసం ముందుగా చంద్ర‌బాబు కృష్ణా జిల్లాలోని పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌రిశీలించారు. ఆ త‌ర్వాత గుడివాడ పేరు ప‌రిశీల‌న‌కు వ‌చ్చింది. ఇక బాల‌య్య‌కు మ‌రో ప‌ద‌వి ఇచ్చి హిందూపురంలో లోకేష్‌ను పోటీ చేయిస్తే ఎలా ఉంటుంద‌ని ఆలోచించారు. ఇక చివ‌ర‌గా విశాఖ జిల్లాలోని భీమిలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోకేష్‌ను బ‌రిలో దింపితే ఎలా ఉంటుంద‌ని ఆలోచించారు. ఇక వీట‌న్నింటి కంటే ముందుగా చిత్తూరు జిల్లాలోని చంద్ర‌గిరి పేరు ప‌రిశీల‌న‌కు వ‌చ్చినా అది అంత సేఫ్ కాద‌నుకున్నారు.

ఇలా లోకేష్ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో దిగేందుకు ఒక్క నియోజ‌క‌వ‌ర్గం అష్ట‌క‌ష్టాలు ప‌డుతోన్న చంద్ర‌బాబు మ‌దిలో ఇప్పుడు కుప్పం ఆలోచ‌న వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. లోకేష్ ను కుప్పం నుంచి పోటీ చేయించాలని బాబు భావిస్తున్నాడట… ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. కుప్పంలో చంద్ర‌బాబు వ‌రుస‌గా ఆరుసార్లుగా గెలుస్తున్నారు. ఇది త‌మ‌కు కంచుకోట‌.

ఈ క్ర‌మంలోనే త‌న‌యుడిని బ‌య‌ట నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయించి రిస్క్ చేయ‌డం క‌న్నా తాను సీఎం హోదాలో బ‌య‌ట పోటీ చేసి లోకేష్‌ను చాలా సేఫ్‌గా గెలిపించేందుకు ఆయ‌న కుప్పం వ‌దులుకునే ఆలోచ‌న చేస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే లోకేష్ కుప్పం నుంచి పోటీ చేస్తే చంద్ర‌బాబు కృష్ణా జిల్లా పెన‌మ‌లూరు లేదా గుడివాడ‌ల‌లో ఎక్క‌డో ఓ చోట నుంచి పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఒక‌వేళ బాబు ఉత్త‌రాంధ్ర నుంచి పోటీ చేయాల‌నుకుంటే విశాఖ జిల్లాలోని భీమిలి పేరును లైన్లో పెట్టిన‌ట్టు టీడీపీ వ‌ర్గాల్లోనే వార్త‌లు చ‌క్కెర్లు కొడుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు, లోకేష్ ఇద్ద‌రూ రాష్ట్రం అంతా ప్ర‌చారం చేయాలి. ఈ క్ర‌మంలోనే లోకేష్‌కు అస్స‌లు ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఆయ‌న కుప్పం త్యాగం చేస్తార‌ని టాక్‌.?