కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. ప్రస్తుతం తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సమైక్య వాదాన్ని పార్లమెంటులో వినిపించిన ఆయన.. రాష్ట్రం రెండు ముక్కలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించి.. దానికి కట్టుబడి ఉన్న విషయం తెలిసిందే! అయితే ప్రస్తుతం లగడపాటి ఇంట్లో పెళ్లి భాజాలు మోగే సమయం వచ్చింది. ఆయన ఇద్దరు కుమారులకు ఒకేసారి ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు హైదరాబాద్లోని పార్క్ హయత్ వేదిక కాబోతోంది.
ఎన్నికల సమయంలో మాత్రం ప్రెస్ మీట్ పెట్టి.. మీడియా సంస్థలకు పోటీగా తనదైన సర్వే ఫలితాల్ని చెబుతుంటారు. ఆయన సర్వేలకున్న ఇమేజ్ ఎంతంటే.. ప్రముఖ మీడియా సంస్థలకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో.. లగడపాటి సర్వే ఫలితాలకు అంతే ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి. ఇలా.. చిత్రమైన ఎన్నో విశేషాల సమాహారమైన లగడపాటికి సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి తాజాగా వార్తల్లోకి వచ్చింది.
ఆయన ఇద్దరు కుమారులకు పెళ్లి ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇరువురు కొడుకులకు ఒకేసారి ఎంగేజ్ మెంట్ చేయాలని డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. ఆయన ఇద్దరి కొడుకుల పేర్లను చూస్తే.. ఒకరి పేరు అశ్రిత్ అయితే.. మరొకరు ప్రణయ్ లు. ఇద్దరి ఎంగేజ్ మెంట్ లు .. హైదరాబాద్ లోని ఈ నెల 26న పార్క్ హయత్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. పెళ్లికూతుళ్లలో ఒకరు కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి దానం నాగేందర్ బంధువుగా తెలుస్తోంది. మరో పెళ్లికుమార్తె పశ్చిమ బెంగాల్ కు చెందిన వారని చెబుతున్నారు. పెళ్లికుమార్తెలకు సంబంధించిన వివరాలు బయటకు రావాల్సి ఉంది.