కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పొలిటికల్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్సయిపోయిందా? ఆయన ప్రధాన విపక్షం జగన్ పార్టీ వైసీపీలోకి ఎంట్రీ ఇస్తున్నారా? అంటే ఔననే అంటున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజకీయ నేతలు. విషయంలోకి వెళ్తే.. గడిచిన రెండేళ్లుగా ముద్రగడ ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా కనిపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కాపు లకు రిజర్వేషన్ ఇవ్వడంలో చంద్రబాబు తాత్సారం చేస్తున్నారని ఆయన పదే పదే విమర్శించడమే కాకుండా కాపులకు రిజర్వేషన్ సాధించేందుకు ఆయన అలుపెరుగని కృషి చేస్తున్నారు. తన భార్యతో కలిసి పురుగుల మందు తాగేందుకు సైతం ఒకానొక దశలో రెడీ అయ్యారు. చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు.
ఇక, తన కాపు ఉద్యమంలో భాగంగా జూలై 26 నుంచి కిర్లంపూడి నుంచి అమరావతి వరకు పాదయాత్రకు పిలుపునిచ్చారు. అయితే, ఈ ఉద్యమాలను చంద్రబాబు ప్రభుత్వం సాగనివ్వడం లేదు. ముద్రగడకు పచ్చజెండా ఊపితే.. పరిస్థితి రాజకీయంగా విషమిస్తుందని, టీడీపీకి చేటు తెస్తుందని బాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను హౌస్ అరెస్టు చేశారు. ఇది ఇలా ఉంటే.. ముద్రగడ ఉద్యమం వెనుక వైసీపీ అధ్యక్షుడు జగన్ ఉన్నాడని టీడీపీ నేతలు భారీ స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిని వైసీపీ కానీ,ముద్రగడ వర్గం కానీ ఏ సందర్భంలోనూ ఖండించలేదు. అలాగని ముద్రగడ ఉద్యమం వెనుక తామే ఉన్నామని జగన్ ఎప్పుడు ప్రకటించుకోలేదు.
అయితే, అనూహ్యంగా నిన్న ముద్రగడను హౌస్ అరెస్టు చేసిన తర్వాత జగన్ తన ట్విట్టర్లో మండిపడ్డారు. చంద్రబాబును ఉద్దేశించిన రాసిన ట్వీట్లో.. మీరిచ్చిన హామీలను నెరవేర్చమని అడుగుతున్న వారిపై ఇలా దాష్టీకం తగదని పేర్కొన్నారు. ఇక, దీంతో ఇప్పుడు వైసీపీ.. ముద్రగడలు ఏకమవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తూర్పుగోదావరిలో ముద్రగడకు ఉన్న బలాన్ని తెలుసుకున్న జగన్.. ఆయనను పార్టీలోకి ఆహ్వానించాలని డిసైడ్ అయినట్టు చెబుతున్నారు. దీనికి వచ్చే నెల 23ను ముహూర్తంగా నిర్ణయించారని కూడా ప్రచారం జరుగుతోంది. వచ్చే 2019 ఎన్నికల్లో కాకినాడ ఎంపీ సీటును ముద్రగడకు కేటాయించాలని కూడా జగన్ అనుకున్నారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఇక, నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్లో చక్రం తిప్పిన అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా జగన్ పంచకు చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే.. తూర్పులో వైసీపీ బలం భారీ ఎత్తున పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. ఫలితంగా టీడీపీకి గట్టి చావు దెబ్బతప్పదని చెబుతున్నారు. అంతేకాదు, ఇప్పటికే పశ్చిమ గోదావరిలో ఆక్వా పరిశ్రమ విషయంలో టీడీపీపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని, అదేవిధంగా కాపు రిజర్వేషన్ విషయం కూడా వ్యతిరేక ఉందని, తూర్పులో అయితే టీడీపీ జెండా పట్టుకుని తిరిగేందుకు కూడా నేతలు జంకుతున్నారని అంటున్నారు. ఇదంతా జగన్కు కలిసొచ్చే అంశమని, ఈ రెండు జిల్లాల్లోనూ టీడీపీ పూర్తిగా చచ్చిపోవడం ఖాయమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.