ఏపీ, తెలంగాణల్లో ప్రముఖ స్థానంలో ఉన్న ఓ మీడియా సంస్థలో ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ పెట్టుబడుల వరద పారించారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ మీడియా సంస్థ ఇంతితై అన్నట్టుగా ఇరు రాష్ట్రాల్లోనూ ఎదిగిపోతోందని సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. 2014 ఎన్నికలకు ముందు అంతగా సర్క్యులేషన్, అంతగా పాఠకులు లేని పత్రిక ఇప్పుడు ఏపీలో పాఠకుల వేటలో పడడంతో పాటు అత్యాధునిక హంగులతో దూసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తోంది. దీంతో ఇప్పుడు దీని వెనుక ఎవరున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రాష్ట్రంలో ప్రధానంగా భారీ సర్క్యులేషన్ ఉన్న పత్రికతో పాటు మరో పార్టీ పత్రిక కూడా మంచి హవా మీదుంది. అయితే, మరో పత్రిక ఇప్పుడు ఈ రెండింటినీ మంచి దూసుకు పోయేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే లోకేష్ సహా పలువురు టీడీపీ పెద్దల నుంచి పెట్టుబడులు ఈ పత్రికకు అందాయని సమాచారం. దీనికి తోడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. అన్ని జిల్లాల్లోనూ పత్రికా కార్యాలయం పేరుతో ఎకరాలకు ఎకరాలు స్థలాలను సైతం ఈ పత్రిక అధిపతి సొంతం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే విజయవాడ శివారులో ఓ ఏడాది కిందట ఏర్పాటు చేసిన ఈ పత్రిక కార్యాలయం కోసం.. 40 అడుగుల తార్రోడ్డు సహా కరెంటు లైను తదితరాలను ప్రత్యేకంగా ప్రభుత్వం అప్పటికప్పుడు ఏర్పాటు చేయడాన్ని బట్టి.. లోకేష్ సహా ఆపార్టీ నేతల పెట్టుబడుల విషయంవెలుగులోకి వచ్చింది. ఇక, నిన్న మొన్నటి వరకు కూడా ఈ పత్రిక బ్లాక్ అండ్ వైట్ పేజీలతోనే కాలం గడపగా.. ఇప్పుడు మాత్రం అన్నీ కలర్ పేజీలతో అలరించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు పోవడం కూడా ఆలోచన రేకెత్తిస్తోంది.
లోకేష్ దాదాపు 250 కోట్ల వరకు ఈ పత్రికలో పెట్టుబడులు పెట్టినట్టు చెబుతున్నారు. అదేవిధంగా టీడీపీకి చెందిన కొందరు నేతలు సైతం కోట్లలోనే పెట్టుబడులు పెట్టారని అంటున్నారు. అదేసమయంలో టీడీపీకి గెజిట్గా జగన్ తరచూ పేర్కొనే మరో పత్రిక పట్ల ఇప్పుడు లోకష్ సహా టీడీపీ నేతలు శీతకన్నేశారని కూడా సమాచారం. ఆ పత్రికను పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ప్రధానంగా ఆ పత్రిక కేంద్రంలోని ప్రభుత్వంపైనే దృష్టి పెట్టిందని, కానీ, ఈ పత్రిక మాత్రం తమకు ఉప యోగకరంగా ఉందని కూడా వీరు భావిస్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో ఈ పత్రికలో పెట్టుబడులు పారించినట్టు చెబుతున్నారు. మొత్తానికి రాజకీయాలే కాకుండా లోకేష్ ఇప్పుడు మీడియా రంగాన్ని కూడా శాసించే పరిస్థితి వచ్చిందన్నమాట. అందుకే ఈ పత్రిక మొన్న జరిగిన నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీకి బాకాగా మారిపోయిందని విశ్లేషకులు అంటున్నారు. అదేసయమంలో జగన్ను ఏకిపారేయడంలోనూ ముందుందని చెబుతున్నారు.