పార్టీ సభ్యత్వానికి జనసేన తెరలెత్తింది. 2014లోనే స్థాపించినప్పటకీ.. అప్పటి ఎన్నికలకు దూరంగా ఉన్న ఈ పార్టీ.. 2019పై మాత్రం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటామని జనసేనాని పవన్ ఇప్పటికే ప్రకటించారు. తాను అనంతపురం నుంచి బరిలోకి దిగుతున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ దృష్టి పెట్టారు. ఇప్పటికే జిల్లాల వారీగా నేతలు, కార్యకర్తల ఎంపిక సాగింది. ఒక్కొక్క రంగంలో అనుభవం, వారి పాండిత్యాన్ని బట్టి నేతలను ఎంపిక చేశారు.
ఇక, ఇప్పుడు ప్రధానంగా కావాల్సిన సభ్యత్వంపై దృష్టి పెట్టాడు పవన్. సాధ్యమైనంత ఎక్కువ మందిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని ఆయన భావిస్తున్నారు. దీనిని మొత్తంగా రెండు దశల్లో నిర్వహించాలని కూడా ప్లాన్ చేసి అమలు చేస్తున్నట్టు కూడా సమాచారం. తొలిదశలో యూత్పై దృష్టి పెట్టారు. వీరు సభ్యత్వం తీసుకునేందుకు వీలుగా ఆన్లైన్ అప్టికేషన్ ఫార్మాట్ను ప్రవేశపెట్టారు. దీంతో సభ్యత్వ నమోదుకు కుర్రకారు పోటెత్తవచ్చుననే అంచనాలు ఉన్నాయి.
ఇక, రెండో దశలో సాంప్రదాయ రాజకీయాసక్తి ఉన్న సామాన్యుల వద్దకు జనసేన కార్యకర్తలు స్వయంగా వెళ్తారు. ట్యాబ్ లో వివరాలు నింపుతూ.. ఈ జెనరేషన్లో సర్వేలు నిర్వహిస్తున్న తీరుగానే.. స్మార్ట్ ఫోన్లతో తమ పార్టీ పట్ల ఆసక్తి ఉన్న వారి వద్దకు వెళ్లి.. వారి వివరాలను నింపి.. సభ్యత్వం ఇస్తారు. మరోపక్క, గ్రామాల్లోని ప్రజలు, గృహిణుల కోవలోకి వచ్చే మహిళలు లాంటి వారిని పార్టీ దూరం చేసుకున్నట్లుగా అవుతుంది. అలాంటి వారికి కూడా కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులో ఉంచేలా.. పవన్ కల్యాణ్ ఆలోచించాలి.
ఆన్ లైన్ సభ్యత్వ నమోదు లాగానే.. ఐవీఆర్ఎస్ ద్వారా నమోదు కూడా చేపట్టవచ్చు. ఇంటర్నెట్ పరిజ్ఞానం లేని వారు కూడా కేవలం.. ఫోను కాల్ ద్వారా.. టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి.. తమ వివరాలు చెప్పి.. తమ గుర్తింపుకు సంబంధించిన ఏదో ఒక ఆధారం తాలూకు వివరాలు చెప్పి నమోదు చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తే.. సాంకేతిక అంతరాలు లేకుండా, దెబ్బతీయకుండా.. అందరు ప్రజలకు సభ్యత్వ నమోదును అందుబాటులో ఉంచినట్లు అవుతుంది. దీనివల్ల పార్టీ విస్తరణకు కూడా ఎక్కువ అవకాశం కలుగుతుంది. మరి పవన్ ఆదిశగా ఆలోచిస్తాడో లేడో చూడాలి.