అధికారిక రహస్యాలు బయటికి వెల్లడించకూడదు.. అందులోనూ పార్టీలో అంతర్గతంగా తీసుకునే నిర్ణయాలు అందరికీ చెప్పేస్తే ఎలా ఉంటుందో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి బాగా తెలిసి వచ్చుంటుంది. రాజకీయాల్లో నోరుజారకూడదు.. పాపం అలా చేసినందుకే ఆయనకున్న చీఫ్ విప్ పోస్టు కూడా పోయిందనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. పల్లె రఘునాథరెడ్డి అత్యుత్సాహం ఇప్పుడు ఆయనకున్న ఒక్కగానొక్క పదవి కూడా పోయేలా చేసిందనే గుసగుసలు అసెంబ్లీ లాబీల్లో వినిపిస్తున్నాయి.
మంత్రి పదవి పోయినందుకే తీవ్ర మనోవేదనతో ఉన్న పల్లె రఘునాథరెడ్డికి ఇప్పుడు ప్రభుత్వ చీఫ్ విప్ పోస్టు కూడా లేకుండా పోయింది. మంత్రి పదవి కుల సమీకరణల నేపథ్యంలో పోగా… నోరుజారి చీఫ్ విప్ పదవి పోగొట్టుకున్నట్టు మంగళవారం శాసనసభ లాబీల్లో తెలుగుదేశం పార్టీ నేతలే చెప్పుకొచ్చారు. మంత్రివర్గ విస్తరణకు ముందు కాల్వ శ్రీనివాసులు చీఫ్ విప్గా ఉన్నారు. ఆయన బోయ సామాజిక వర్గానికి చెందినవారు. ఆ వర్గాన్ని ఎస్టీల్లో చేరుస్తామని చంద్రబాబు 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు.
అది సాధ్యపడే అవకాశం లేకపోవడంతో ఆ వర్గానికి చెందిన కాల్వకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ విషయాన్నే పల్లెకు చంద్రబాబు వివరించారు. `మిమ్మల్ని మంత్రివర్గం నుంచి తప్పించాలని లేదు. కానీ బోయల్ని ఎస్టీల్లో చేర్చే పరిస్థితి లేదు. ఆ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు కాల్వకు మంత్రి పదవి ఇవ్వాలనుకున్నా. మీకు చీఫ్ విప్ పదవి ఇస్తా`నని చెప్పారు. దాంతో సంతృప్తి పడిన పల్లె రఘునాథరెడ్డి ఆగమేఘాల మీద సమాచార ప్రజా సంబంధాల శాఖ నుంచి మీడియాకు ప్రకటన ఇప్పించుకున్నారు.
చీఫ్ విప్ పేరిట ఓ వాట్సాప్ గ్రూపును తయారు చేయించుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే కథ మారింది. మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించాల్సి వస్తుందో తనకు రహస్యంగా సీఎం చెప్పిన విషయాన్ని తన అనుచరుల వద్ద బయటపెట్టేశారట. అది కాల్వ శ్రీనివాసులుకు తెలిసి.. ఆయన ద్వారా చంద్రబాబు చెవిన పడింది. ఇంకేముంది బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పల్లెకు ప్రకటించిన చీఫ్ విప్ పదవి కూడా పీకేశారు. అందువల్లేనేమో శాసనసభలో కాల్వ శ్రీనివాసులు చీఫ్ విప్ పాత్ర కూడా పోషించారు. మరి అనవసరంగా నోరుజారి.. పదవి కూడా పోగొట్టుకున్నారు.