సుప్రీం తీర్పుతో తమిళనాడు రాజకీయం కొత్త మలుపు తిరిగింది! ఇప్పటి వరకు సీఎం సీటు కోసం ఆరాట పడ్డ శశికళ ఇప్పుడు జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సీఎం సీటులో ఎవరు కూర్చుంటారు? పన్నీర్ సెల్వానికి మద్దతు పెరుగుతుందా? శశి తదుపరి వ్యూహం ఏమిటి? అందరి ఆలోచనలూ ఇవే. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో ఇప్పటి వరకు అంతగా పరిచయం లేని ఇద్దరు తెరమీదకి వచ్చారు. తామే దివంగత జయలలితకు అసలు సిసలు వారసులమని చెబుతున్నారు. దీంతో ఈ ఇద్దరి విషయం హాట్ టాపిక్గా మారింది. వారి గురించి తెలియాలంటే.. ఈ కథనం చదవాల్సిందే.
తమిళనాడులో తిరుగులేని నేతగా ఎదిగిన జయలలిత అన్నయ్యకు ఇద్దరు పిల్లలు. వారే దీప, దీపక్. మొన్నామధ్య జయ మరణం తర్వాత మీడియాలో దీప పేరు ప్రముఖంగానే వినిపించింది. శశికళను బహిరంగంగా పెద్ద ఎత్తున విమర్శించిన దీప.. జయకు అసలు సిసలు వారసురాలిని తానేనని ప్రకటించుకున్నారు. త్వరలోనే రాజకీయంగా చక్రం తిప్పుతానని కూడా ఆమె ప్రకటించారు. దీంతో ఆమె శశికళకు వ్యతిరేకంగా పన్నీర్కు పరోక్షంగా మద్దతిస్తున్నారన్న విషయం తెలిసిపోయింది. ఇక, ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన పేరు దీపక్.
ఈయన జయ పార్థివ దేహానికి శశికళతో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు మించి పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే, ఇప్పుడు శశికళకి సుప్రీం జైలు శిక్ష విధించడంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా దీపక్ బాధ్యతలు తీసుకుంటాడనే వ్యాఖ్యలు వినిపించాయి. గతంలో మాట్లాడిన దీపక్.. అన్నాడీఎంకేకి అసలు సిసలు వారసులు ఎవరైనా ఉంటే. శశికళ,ఆమె భర్త నటరాజన్.. తాను మాత్రమేనని చెప్పుకొచ్చాడు.
ఈ నేపథ్యంలో దీపక్ శశికళ పక్షం అన్న సంగతి స్పష్టమైంది. దీంతో సెల్వం పక్కన దీప, శశికళ పక్కన దీపక్లు పోరుకు సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ దీపక్నే శశికళ.. అన్నాడీఎంకే పార్టీకి ప్రధాన కార్యదర్శిని చేస్తే.. దీప రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటి వరకు అయితే, అక్కా తమ్ముళ్ల పొలిటికల్ వార్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది.