తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీపై గత యేడాది కాలంగా తమిళనాడు మీడియాలో ఎన్నో వార్తలు ప్రకంపనలు రేపుతున్నాయి. రజనీ కొత్త పార్టీ పెడతారని ఓ సారి, ఆయన బీజేపీలోకి వెళతారని మరోసారి, రజనీ కొత్త పార్టీ పెట్టి, బీజేపీతో కలుస్తారని ఇలా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. రజనీ కొద్ది రోజులుగా తన అభిమాన సంఘాలతో మీట్ అవుతున్నారు.
రజనీ కొత్త పార్టీ పెడతారన్న వార్తలతో ఆయన పొలిటికల్ ఎంట్రీని కొందరు స్వాగతిస్తుండగా, మరి కొందరు ఆయన్ను టార్గెట్గా చేసుకుని విమర్శలు కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే లేటెస్ట్గా రజనీ పొలిటికల్ ఎంట్రీపై కొత్త వార్త బయటకు వచ్చింది. రజనీకాంత్ మరో పక్షం రోజుల్లో కొత్త పార్టీని స్థాపించడం ఖాయమని గాంధేయ ఉరుమై ఇయక్కం అధ్యక్షుడు తమిళురువి మణియన్ చెప్పారు.
రజనీ కొత్త పార్టీ ఏర్పాటుపై మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రజనీ కొత్త పార్టీ గుట్టు విప్పారు. తాను ఇటీవల రజనీతో రెండుసార్లు మీట్ అయ్యి, ప్రస్తుతం తమిళనాట నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు చెప్పారు. తమిళనాడు ప్రజల అభివృద్ధే ధ్యేయంగా రజనీ కొత్త పార్టీ ఏర్పాటు కానుందని, రజనీ రాజకీయాల్లోకి వచ్చేది డబ్బు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునేందుకు కాదని తనను సూపర్స్టార్ చేసిన ప్రజలకు మేలు చేసేందుకే అని ఆయన తెలిపారు.
ఇక మరో 15 రోజుల్లోనే రజనీ కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రకటన రానుందని ఆయన చెప్పారు. ఇక పార్టీ ఏర్పాటు ప్రకటనతో పాటు పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను వెల్లడించే అవకాశం ఉందని మణియన్ పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళనాడులో జరుగుతోన్న చర్చల ప్రకారం రజనీ కొత్త పార్టీ పెట్టి బీజేపీతో పొత్తు పెట్టుకునే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తోంది.