పాలిటిక్స్ అన్నాక ఎక్కడేసే తాళం అక్కడ వేయాల్సందే! అయితే, అది సృతి తప్పకుండా మాత్రం చూసుకోవాలి. ఏ మాత్రం సృతి తప్పినా.. నాటకం బయటపడిపోవడ ఖాయం! ఇప్పుడివన్నీ ఎందుకంటే.. టీడీపీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి.. చేస్తున్న వ్యాఖ్యలు డబుల్ రోల్ పాలిటిక్స్ని తలపిస్తున్నాయి. ఏపీలో ఉంటే ఒకలాగా, తెలంగాణలో ఉంటే మరోలాగా మాట్లాడడం రేవంత్కి అలవాటైపోయిందట! ఇప్పుడు ఆయన వైఖరిపై తెలుగు తమ్ముళ్లే ఆశ్చర్యపోతున్నారు.
నాలుగు రోజుల కిందట విశాఖలో జరిగిన టీడీపీ మహానాడుకు రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. చంద్రబాబు వల్లే తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్ ఉందని, 24 గంటలూ కరెంటు సరఫరా జరుగుతోందని చెప్పాడు. అదేసమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్పై దుమ్మెత్తి పోశాడు. దీంతో అందరూ రేవంత్ ప్రసంగానికి, కామెంట్లకు జై కొట్టి.. జబ్బలు చరుచుకున్నారు. ఏపీ వాళ్లంటే రేవంత్కి ఎంత ప్రేమో అనుకున్నారు.
ఇక, తాజాగా నిన్న తెలంగాణలో సీఎం కేసీఆర్పై దుమ్మెత్తి పోసే కార్యక్రమంలో భాగంగా ఏపీ వాళ్లని ఉతికి ఆరేశాడు రేవంత్. తెలంగాణలో ఏ ప్రాజెక్టు కట్టాలన్నా.. ఏపీ కాంట్రాక్టర్లే కావాలా? అంటూ మొదలు పెట్టిన రేవంత్ ప్రసంగం సుదీర్ఘంగా సాగి.. సీఎం కేసీఆర్ని నిలువునా కడిగేసింది. ఏపీ వాళ్లకే అన్నీ అప్పజెపితే.. తెలంగాణ వాళ్ల పరిస్థితి ఏంటని రేవంత్ ప్రశ్నించాడు.
మహానాడుకు వెళ్లిన రేవంత్ కి చంద్రబాబు ఇవే మాటలు చెప్పి పంపించారా..? తెలంగాణకు వెళ్లగానే ఆంధ్రా కాంట్రాక్టర్లపై, నేతలపై, కళాకారులపై విమర్శలు చేయమని చెప్పారా..? లేదంటే, ఇలా విమర్శిస్తా అని చంద్రబాబు దగ్గర రేవంత్ పర్మిషన్ తీసుకుని వచ్చారా అనేట్టుగా మాట్లాడుతున్నారు. మరి దీనిపై రేవంత్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.