శ‌శిక‌ళ‌కు నాలుగేళ్ల జైలు శిక్ష‌…సీఎం రేసులో దీప‌క్‌

త‌మిళ‌నాడు సీఎం అయ్యేందుకు జ‌య నెచ్చెలి శశిక‌ళ గ‌త కొద్ది రోజులుగా వేస్తోన్న ఎత్తులు, ప‌న్నుతున్న వ్యూహాలు మామూలుగా లేవు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల‌ను సీక్రెట్‌గా బీచ్ రిసార్ట్స్‌లో ఉంచి శిబిరం నిర్వ‌హిస్తున్నారు. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సీఎం అవ్వాల‌ని క‌ల‌లు కంటోన్న శశికళ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీకే శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది.

ఈ కేసులో శ‌శిక‌ళ‌తో పాటు మరో ముగ్గురిని కూడా దోషులుగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. శశికళకు రూ. 10 కోట్ల జరిమానా విధించింది. దాంతో తమిళ రాజకీయ డ్రామాకు పూర్తిగా తెరపడినట్లయింది. శ‌శిక‌ళ‌కు నాలుగేళ్ల జైలు శిక్ష ప‌డ‌డంతో నెక్ట్స్ త‌మిళ‌నాడు సీఎం ఎవ‌ర‌న్న‌దానిపై ఇప్పుడు జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

ఏ నేరంలోనైనా శిక్ష అనుభవిస్తే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదన్న నిబంధన ఉన్న సంగ‌తి తెలిసిందే. దీంతో శ‌శిక‌ళ‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పూర్తిగా పోయాయి. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే శ‌శిక‌ళ త‌న‌కు వ్య‌తిరేకంగా కోర్టు తీర్పు ఇస్తే త‌ర్వాత ముఖ్యమంత్రిగా ఎవరిని చేయాలనే అంశంపై ముఖ్య ఎమ్మెల్యేలతో చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది.

ఆమె మ‌న‌స్సులో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా…ఫైన‌ల్‌గా ఆమె త‌న మేన‌ల్లుడు దీప‌క్‌ను రంగంలోకి దింపేందుకు తెర‌వెన‌క రంగం సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. దీపక్‌కు సీఎం పదవి కట్టబెట్టి మంత్రాంగం నడిపించాలని శశి భావిస్తున్నట్లుగా సమాచారం. మ‌రి శ‌శి ఆశ‌ల‌న్ని అడియాలైన నేప‌థ్యంలో ఈ కొత్త ఎత్తు అయినా ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.