శశికళకు సోషల్ మీడియాలో చుక్కెదురు

ఒక‌ప‌క్క అన్నాడీఎంకే కార్య‌ద‌ర్శి, జ‌యల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ‌కు మ‌ద్ద‌తు త‌గ్గిపోతూ ఉన్న వేళ‌.. జ‌య న‌మ్మిన‌బంటు ప‌న్నీర్ సెల్వానికి అంత‌కంత‌కూ మ‌ద్ద‌తు పెరుగుతున్న వేళ‌.. సోష‌ల్ మీడియాలో త‌మిళ రాజ‌కీయాల‌పై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌న్నీర్ సెల్వం వేసే ఎత్తుల‌తో శ‌శిక‌ళ వ‌ర్గం ఢీలా ప‌డిపోతోంది.

సీఎం పీఠం కోసం జ‌రుగుతున్న పోరులో.. ప‌న్నీర్‌కు ప్ర‌జల మ‌ద్ద‌తుతో పాటు.. నెటిజ‌న్ల మ‌ద్ద‌తు కూడా పెరుగుతోంది. సీఎం అభ్య‌ర్థి ప‌న్నీర్ సెల్వ‌మా లేక శ‌శిక‌ళ‌నా అని నిర్వ‌హించిన స‌ర్వేలో అనూహ్యంగా ప‌న్నీర్ సెల్వానికి విశేష ఆద‌ర‌ణ ద‌క్కింది. సీఎంగా మెజారిటీ వ‌ర్గాలు.. ప‌న్నీర్ సెల్వానికే మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. ఈ స‌ర్వేలో శశిక‌ళ‌కు చుక్కెదురైంది.

త‌మిళ‌నాట రాజ‌కీయాల‌పై దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. అనూహ్య మలుపులు తిరుగుతున్న తమిళనాడు రాజకీయాలు గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు వ‌ద్ద‌కు చేరాయి. గురువారం ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ వీకే శశికళ గవర్నర్ ను కలిసిన విషయం తెలిసిందే. బల నిరూపణకు తనకు అవకాశం ఇవ్వాలని పన్నీర్ కోరగా.. మెజారిటీ ఎమ్మెల్యేల మద్ధతు తనకే ఉందని, సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలని శశికోళ కోరారు. అయితే విద్యాసాగర్ రావు మాత్రం తన నిర్ణయాన్ని వెల్లడించకుండా, కేంద్రానికి నివేదిక పంపారు. దీంతో ఆయన ఏ నిర్ణ‌యం తీసుకుంటారో ఉత్కంఠ‌గా ఉన్నారు.

కాగా అభిప్రాయాలు తెలియ‌జేసేందుకు వేదికగా మారుతున్న సోష‌ల్ మీడియా సైట్ల‌లో శ‌శిక‌ళ‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతోపాటు పన్నీర్ సెల్వానికి అనూహ్యంగా మ‌ద్ద‌తు పెరుగుతోంది. సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ లో సీఎంగా పన్నీర్ సెల్వం కొనసాగాలా.. మార్పు జరగాలా అని పోల్ సర్వే నిర్వహించారు. పన్నీర్ సెల్వానికే పట్టం కట్టాలని రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

‘సీఎంవో తమిళనాడు’ వేదికగా జరిగిన ట్విట్టర్ ఖాతాలో పన్నీర్ సెల్వం సీఎంగా కొనసాగాలని 95 శాతం నెటిజన్లు మద్ధతు ప‌లికారు. కేవలం 5శాతం మాత్రమే శశికళ సీఎం కావాలని కోరుకోవ‌డం గ‌మ‌నార్హం! మొత్తంగా 52,876 మంది తమ అభిప్రాయాన్ని వెల్లడించి ఈ సర్వేలో పొల్గొన్నారు.