సొంత నియోజ‌క‌వ‌ర్గాలు వ‌ద్దు…. ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాలే ముద్దు..!

2019 ఎన్నిక‌ల‌కు ఇంకా యేడాదిన్న‌ర టైం ఉంది క‌దా ? అని చూస్తూ కూర్చునే ప‌రిస్థితి లేదు. ముంద‌స్తు ఎన్నిక‌లు ఎప్పుడైనా ముంచుకొచ్చే సంకేతాలు వ‌స్తున్నాయి. కేంద్రంలో మోడీ ముంద‌స్తుగా కాలు దువ్వుతుండ‌డంతో ఇక్క‌డ తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ముంద‌స్తుకే మొగ్గు చూపుతున్నారు. మ‌రో టాక్ ఏంటంటే 2018 చివ‌ర్లోనే ఎన్నిక‌లు ఉన్నా ఉండొచ్చు. దీంతో నాయ‌కుల ఆలోచ‌న‌లు కుదురుగా ఉండ‌డం లేదు. మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసేయాలి.. మ‌ళ్లీ తామే గెలిచేయాల‌న్న కోరిక వారి మ‌దిని తెగ తొల‌చి వేస్తోంది.

ఈ క్ర‌మంలోనే రాయ‌ల‌సీమ‌కు చెందిన కొంద‌రు టీడీపీ సీనియ‌ర్లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ వార‌సుల‌ను కూడా రంగంలోకి దించేందుక చాప‌కింద నీరులా ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. తాము ప్రాథినిత్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు త‌మ వార‌సుల కోసం ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాల మీద కూడా ప‌ట్టుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అనంత‌పురం జిల్లా నుంచి మంత్రిగా ఉన్న ప‌రిటాల సునీత వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న వార‌సుడు శ్రీరామ్‌ను రంగంలోకి దించేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇందుకోసం ఆమె అనంత‌పురం అర్బ‌న్‌, ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల మీద ప‌ట్టు సాధించేందుకు ప్ర‌య‌త్నించి ఫెయిల్ అయ్యారు. అక్క‌డ ఉన్న త‌మ సామాజిక‌వ‌ర్గానికే చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో సునీత జోక్యంపై చంద్ర‌బాబుకు కంప్లెంట్ చేయ‌డంతో సునీత‌కు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో చెక్ ప‌డింది. ఇక ఇప్పుడు ఆమె తాను గ‌తంలో ప్రాథినిత్యం వ‌హించిన పెనుకొండ సీటుపై ప‌ట్టుకోసం ట్రై చేస్తున్నారు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో తాను, త‌న త‌న‌యుడు శ్రీరామ్ పోటీ చేయాల‌న్న‌ది సునీత ప్లాన్‌.

ఇక హిందూపురం ఎంపీ నిమ్మ‌ల కిష్ట‌ప్ప కూడా త‌న వార‌సుడి కోసం పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గాలను ఆయ‌న ప‌రిశీలిస్తున్నారు. అలా కుద‌ర‌ని ప‌క్షంలో తాను హిందూపురం ఎంపీ సీటును త్యాగం చేసి తాను ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక సీటు నుంచి అసెంబ్లీకే పోటీ చేసేందుకు ఆయ‌న ఉత్సాహంగా ఉన్నారు.

ఇక అనంత‌పురం ఎంపీ దివాక‌ర్‌రెడ్డికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనంత‌పురం ఎంపీ సీటు, తాడిప‌త్రి, అనంత‌పురం అర్బ‌న్ సీట్లు కావాల‌ట‌. ఇక శింగ‌న‌మ‌ల‌లో కూడా ఆయ‌న చెప్పివాళ్ల‌కే టిక్కెట్ ఇవ్వాల‌ట‌. తాను, త‌న సోద‌రుడు, త‌న కుమారుడు ఈ ముగ్గురికి టిక్కెట్లు కోరేందుకే జేసీ నానా హంగామా చేస్తున్నాడ‌ట‌. ఇక క‌ర్నూలు జిల్లాలో సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంకటేష్‌ తనయుడు రంగంలోకి దిగాడు. నంద్యాల ఎంపీ నియోజకవర్గంపై ఆయ‌న క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి రాబోయే ఎన్నిక‌ల్లో వార‌సుల కోసం సీనియ‌ర్ నేత‌ల ఎత్తులు ఇంకెన్ని బ‌య‌ట‌కు వ‌స్తాయో ? చూడాలి.