కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు సేవ చేసే భాగ్యం లభించడం అంత వీజీకాదు. టీటీడీ చైర్మన్గా సర్వం సహా అధికారాలను దక్కించుకుని తిరుమలలో పాలన సాగించే అవకాశం కోసం ఎందరో ఎదురు చూస్తుంటారు. వీరిలో ఇటీవల కాలంలో మనకు ప్రముఖంగా కనిపించిన వ్యక్తి గుంటూరుకు చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావు. టీటీడీ చైర్మన్గా ఆయన పనిచేయాలని ఎంతగానో భావించారు. ఇటీవల ఆ పోస్టు ఖాళీ అవడంతో తనను నియమించాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు వర్తమానం పంపారు.
అయితే, అనూహ్య పరిస్థితిలో ఈ పదవికి పోటీ ఎక్కవు కావడంతో బాబు ఎటూ తేల్చుకోలేక పోయారు. దీంతో రాయపాటి తనలో ఉన్న కోరికను మరింత గట్టిగా వినిపించేందుకు మీడియాను ఎంచుకున్నారు. అవసరమైతే.. తాను తన ఎంపీ సీటును వదులుకునేందుకు తాను సిద్ధమేనని తనకు తీరని కలగా మిగిలిపోయిన టీటీడీ చైర్మన్ పదవిని తనకు ఇవ్వాలని గళం బాగానే వినిపించారు. అయితే, ఈ విషయాన్ని పెండింగ్లో పెట్టిన సీఎం అనూహ్యంగా నిన్న తన డెసిషన్ వెల్లడించేశారు.
కడప జిల్లా మైదుకూరుకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ కు చైర్మన్ గిరీ దక్కింది. దీనివెనుక మంత్రి యనమల చక్రం తిప్పారన్నది బహిరంగ రహస్యమే. ఈ పరిణామంతో రాయపాటి వర్గంలో ఒక్కసారిగా నిరాశ అలుముకుంది. ఊహించని ఈ పరిణామంతో రాయపాటి.. మరో జేసీ అవుతారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక, తన పదవికి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి కూడా విరమించుకునేందుకు ఆయన సిద్ధమయ్యారని సమాచారం. ఇదే విషయాన్ని ఆయన తన అనుచరుల వద్ద ప్రస్తావించారని చెబుతున్నారు. మొత్తానికి మరో 24 గంటల్లో రాయపాటి మీడియా ముందుకు రానున్నారనేది వాస్తవం!! ఏం జరుగుతుందో చూడాలి.