వచ్చే ఎన్నికల నాటికి తమ వారసులను రంగంలోకి దించాలని రాజకీయ నాయకులు తెగ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోపక్క తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సినీ ప్రముఖులు కూడా సిద్ధమవుతున్నారు. సినిమాల్లో ఒక వెలుగు వెలిగి.. `ప్రజాసేవ చేసేందుకు మేమూ కూడా సిద్ధం` అంటూ ప్రకటించేస్తున్నారు. తమకు ఉన్న అభిమానం కొంత వరకూ సాయపడుతుందని ..బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వంటి వారు రాజకీయాల్లోకి రాగా.. ఇప్పుడు హీరో, కేరెక్టర్ ఆర్టిస్ట్ సుమన్ కూడా వీరి బాటలోనే నడవబోతున్నాడు. అంతేగాక ఇందుకు గ్రౌండ్ వర్క్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు!!
తాజాగా మీడియాతో మాట్లాడిన సుమన్.. రాజకీయాల్లోకి ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలే చేశారు. రాజకీయాల్లో చాలామంది ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని అంటున్నాడు. దీంతో చాలామంది తనను రాజకీయాలలోకి రావాలంటున్నారని చెబుతున్నాడు.. తన వంతుగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించాడు. అయితే ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ముక్తాయించాడు ప్రజలకు సేవ చేసేందుకు వచ్చే ఏడాది నుంచి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడంతో ఏ పార్టీలో చేరతాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
80వ దశకంలో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుమన్.. అనతి కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అన్నమయ్యలో వెంకటేశ్వరస్వామి పాత్రలో ఒదిగిపోయి.. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. అప్పటి నుంచి విలన్గా, కేరెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ భాషల్లో కొనసాగుతున్నారు. అయితే గౌడ సామాజికవర్గానికి చెందిన సుమన్, ప్రముఖ కథా రచయిత, సినీ నిర్మాత డీవీ నరసరాజు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. తన సామాజికవర్గం వారు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు, సభలకు వెళ్తూ తన కులాభిమానాన్నికూడా చాటుకుంటున్నాడు. కుల సంఘాలు చేసే డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ మంచిపేరే సంపాదించుకున్నాడు.
అయితే ఇదంతా తన పొలిటికల్ కెరీర్కు సహాయపడడం కోసమే చేస్తున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాడు. ఇప్పుడు మాత్రం ఏ పార్టీలోనూ లేకుండా వ్యవహరిస్తున్నారు. మరి ఇప్పుడు కూడా టీడీపీ వైపే మొగ్గు చూపుతారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.